జమ్మూకాశ్మీర్లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్ పార్టీ మీటింగ్!
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచిన పహల్గామ్లోని బైసరన్ ప్రాంతంలో విహరిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడి చేశారు. ఈ దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం అధికారికంగా ప్రటించింది. ఈ దాడి తర్వాత జమ్మూకాశ్మీర్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మరోవైపు, జమ్మూకాశ్మీర్లో దాడులు జరగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాంతో జమ్మూకాశ్మీర్లో హై అలెర్ట్ ప్రకటించారు.
పలు కీలక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మొహరించారు. శ్రీనగర్, ఉధంపూర్ తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నక్కిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. మరోవైపు, ఉగ్రవాదానికి నిరసనగా జమ్మూకాశ్మీర్లో బంద్ కొనసాగుతోంది. ఈ బంద్లో ప్రజలు దుకాణాదారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
పాకిస్థాన్తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచల నిర్ణయం!!
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామాలో ఉగ్రవాదుల దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాయాది దేశం పాకిస్థాన్తో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందం 1960ని రద్దు చేసింది. ఈ ఒప్పందం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే, అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టు తక్షణమే మూసివేత. సరైన ధృవపత్రాలతో భారత్కు వచ్చినవాళ్లే మే ఒకటో తేదీలోపు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది.
సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థాన్ జాతీయులకు భారత్లోకి ప్రవేశాన్ని నిషేధాన్ని విధించింది. దీనికింద గతంలో ఇచ్చిన వీసాలూ రద్దు. ఈ వీసా కింద ఇప్పటికే భారత్లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో స్వదేశానికి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసింది.
భారత్లోని పాక్ హైకమిషనర్లో ఉన్న సైనిక, వాయు, నౌకాదళ సలహాదారుల వారం రోజుల్లో దేశం వీడాలని ఆదేశించింది. ఇదేసమయంలో భారత్ సైతం ఇస్లామాబాద్లో ఉన్న త్రివిధ దళాల సలహాదారులను ఉపసంహరించుకుంటుందని వెల్లడించింది. అలాగే, ఇరు వైపులా దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని 55 నుంచి 30కి కుదించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలు మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
మరోవైపు, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. వీరిలో నేపాల్ జాతీయుడు కూడా ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. అదేసమయంలో ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఇటీవల తహవ్వుర్ రాణాను భారత్కు రప్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.