1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (09:52 IST)

సభకు వేళాయే... నేటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు...

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లుచేశారు. ఉదయం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ 2021-22 సంవత్సరానికిగాను ఆర్థిక సర్వేను సభకు వెల్లడిస్తారు. 
 
ఈ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజైన సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగం చేయనున్నారు. రాష్ట్రపతి హోదాలో ఆయన చేసే చివరి ప్రసంగం ఇదే కావడం గమనార్హం. ఈ యేడాది జూలై నెలలో రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. 
 
ఆ తర్వాత లోక్‌సభ సమావేశమవుతుంది. ఇందులో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంపత్సర ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక శాఖా మంత్రి సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 
 
కాగా, ఈ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తొలి రెండు రోజులు ప్రశ్నోత్తరాలు, శూన్య గంట వంటివి ఉండవు. కాగా, ఈ సమావేశాల్లో మరోమారు ఇజ్రాయెల్ స్పై వేర్ పెగాసస్ చర్చకు రానుంది. స్పై వేర్ నిజమేనని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తాజాగా కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
మరోవైపు పార్లమెంట్ వేదికగా దేశంలోని పలు సమస్యలపై ప్రశ్నలు సంధించి కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా, రైతులు, సాగు ఇబ్బందులు, చైనార చొరబాట్లు, పెగాసస్ స్పై వేర్, ఎయిర్ ఇండియా విక్రయం, కోవిడ్ బాధితులకు రిలీఫ్ ప్యాకేజీ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి.