1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (22:13 IST)

ప్రమాదానికి గురైన ప్రధాని మోదీ సోదరుడి కారు.. ఎవరికి ఏమైంది?

Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దామోదర్ దాస్ తన కుటుంబంతో సహా బెంగళూరు నుంచి పర్యాటక ప్రదేశమైన బండిపూర్ వైపు కారులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
డ్రైవర్ చక్రాలపై నియంత్రణ కోల్పోయి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డెబ్బై ఏళ్ల దామోదర్ మోదీకి గాయమైంది. అతని కుమారుడు మెహుల్ ప్రహ్లాద్ మోదీ (40), కోడలు జిందాల్ మోదీ, వారి ఆరేళ్ల మనవడు మేనత్ మెహుల్ మోదీ కూడా గాయపడ్డారు. డ్రైవర్ కూడా గాయపడ్డాడు.
 
సరైన సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో, ప్రమాదం ప్రభావం తగ్గింది. ప్రయాణీకులు గాయాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పోలీసు సూపరింటెండెంట్ సీమా లత్కర్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మైసూరు సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
 
గాయపడిన వారందరినీ జేఎస్‌ఎస్‌ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులంతా ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధు తెలిపారు. ప్రహ్లాద్ మోదీ మనవడు తలకు ఎడమ వైపున గాయాలయ్యాయి.