1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (11:22 IST)

ప్రధానమంత్రి మోడీ ఆస్తుల్లో పెరుగుదల

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. 2020లో రూ.2.85 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తుల విలువ రూ.22 లక్షలు పెరిగి.. రూ.3 కోట్ల 7 లక్షలకు చేరింది. తన తాజా డిక్లరేషన్‌లో మోడీ ఈ వివరాలు పేర్కొన్నారు. 
 
అలాగే, చాలా మంది కేంద్ర మంత్రుల్లానే ప్రధానికి కూడా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు లేవు. ప్రభుత్వం నుంచి పొందే జీతమే ఆయనకు ముఖ్య ఆదాయ వనరు. ఆ జీతాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టడం, వాటిపై వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఆయన ఆదాయంలో వృద్ధి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ముఖ్యంగా, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌(రూ.8.9 లక్షలు), ఎల్‌ఐసీ పాలసీలు(1.5 లక్షలు), ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్స్‌లో మోడీకి (2012లో రూ.20 వేలకు కొనుగోలు చేశారు) పెట్టుబడులు ఉన్నాయి. గుజరాత్‌ గాంధీనగర్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో మోడీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. 
 
ఈ విలువే ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ విలువ రూ.1.6 కోట్లు ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి అది రూ.1.86 కోట్లకు చేరింది. ప్రధానికి సొంత వాహనం సైతం లేదు.
 
ప్రస్తుతం ప్రధాని మోడీ వద్ద నాలుగు బంగారపు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ రూ.1.48 లక్షలు. బ్యాంక్‌లో నిల్వ రూ.1.5 లక్షలు. నగదు రూపంలో రూ.36 వేలు ఉన్నాయి. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటివరకు మోడీ ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయలేదు. 2002లో కొనుగోలు చేసిన ఓ స్థిరాస్తి విలువ రూ.1.1 కోట్లుగా ఉంది. ఇది ఉమ్మడి ఆస్తి. మరో ముగ్గురికి ఇందులో వాటా ఉంది.