1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (19:31 IST)

Modi-Biden భేటీ.. చైనా-పాకిస్థాన్‌ల వెన్ను వణుకు.. ఏ అంశాలపై చర్చ?!

Modi_Biden
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని కలవనున్నారు. బైడెన్ జనవరి 20 న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత, ఇద్దరు నాయకులు ముఖాముఖి కూర్చుని మాట్లాడటం ఇదే మొదటిసారి. 
 
రెండు దేశాలకు ఉమ్మడి సవాళ్లు ఉన్నాయి. క్వాడ్ సమావేశంతో పాటు శుక్రవారం భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో తొలిసారిగా వ్యక్తిగతంగా సమావేశం కాబోతున్నారు. ఇరు దేశాలు నేతలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ఈ సమావేశం ఒక అవకాశంగా మారనుంది.
 
మోదీ, బైడెన్ బహిరంగంగా చైనా గురించి మాట్లాడకపోవచ్చు. కానీ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, అఫ్గానిస్తాన్‌లో చైనా దూకుడు గురించి వారిద్దరూ సామరస్యంగా చర్చించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
భారత్‌పై దాడులకు, అఫ్గాన్ కేంద్రంగా జైష్-ఇ-మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి గ్రూపులను తాలిబాన్లు ఉపయోగించకుండా నిరోధించడంలో అమెరికా సహకారాన్ని భారత్ కోరనుంది. చాలా దేశాలు ఇప్పటికే అఫ్గానిస్తాన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతం అవుతున్నాయి. కానీ దీనిపై సొంత విధానాన్ని రూపొందించిన భారత్ దాని గురించి అమెరికాతో చర్చించనుంది.
 
వీటితో పాటు కొన్ని వాణిజ్య వివాదాలు, అపరిష్కృతంగా ఉన్న ఎస్-400 క్షిపణుల కొనుగోలు అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. రష్యా నుంచి భారత్ ఈ క్షిపణులను కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆంక్షల నుంచి భారత్‌కు ఉపశమనం లభిస్తుందా? లేదా అనే అంశాన్ని అమెరికా ఇంకా స్పష్టం చేయలేదు.
 
ప్రస్తుతం మోదీ-బైడెన్‌ల ద్వైపాక్షిక సమావేశం ఈ కఠినమైన సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలను అందించకపోవచ్చు. కానీ వాటి పరిష్కారానికి కావాల్సిన కొత్త రోడ్ మ్యాప్‌ రూపొందించేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది.
 
వీటితో పాటు మరికొన్ని అంశాల్లో రెండు దేశాల మధ్య సహకారం కుదరవచ్చు. గవీ, కోవాక్స్ వ్యాక్సీన్ కార్యక్రమాలకు మద్దతుగా నిలిచేందుకు... యూఎస్ వ్యాక్సీన్ స్టాక్‌ను పెంచడం, భారత ఉత్పత్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం వంటి అంశాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాలు ప్రయత్నించవచ్చు.
 
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి మోడీ అమెరికా వెళ్లినప్పటికీ, మనం ఆయన షెడ్యూల్‌ని నిశితంగా పరిశీలిస్తే, ఈ పర్యటన దౌత్యపరమైన ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతుంది. 
 
క్వాడ్‌లో నాలుగు దేశాలు ఉన్నాయి. భారతదేశం, USA, ఆస్ట్రేలియా, జపాన్. ఈ నాలుగు దేశాలకు సవాలు.. ముప్పు ఏదైనా ఉందీ అంటే అది నేరుగా చైనా నుండి. అందువల్ల, నాలుగు దేశాల దేశాధినేతలు వర్చువల్ సమావేశానికి బదులుగా భౌతికంగా వాషింగ్టన్ చేరుకున్నారు.
 
చైనా-పాకిస్తాన్ ఆసక్తి..
మోడీ, బైడెన్ భేటీలో ఏమి జరుగుతుందో, ఏమి చెబుతారో అనే అంశంపై చైనా అలాగే, పాకిస్తాన్ ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ పెద్ద పాత్ర పోషించాలని అమెరికా కోరుకుంటోంది. అయితే, ప్రస్తుతానికి ఇది సాధ్యం కాదు, ఎందుకంటే దీని కోసం ముందుగా తాలిబాన్ పాలనను అంగీకరించాలి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశమూ దానిని గుర్తించలేదు.
 
చైనా, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సహజ వనరులు, గనుల మీద దృష్టి పెట్టాయి. ఇక ఇక్కడ ఉన్న అతి పెద్ద ప్రమాదం డ్రగ్స్ వ్యాపారం. దీని విషయంలో ప్రపంచం ఆందోళన చెందుతోంది. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌కు ఇచ్చే అన్ని నిధులను అమెరికా స్తంభింపజేసింది. అయితే, ఈ రెండు దేశాలు కూడా ప్రపంచ ప్రతిచర్యకు భయపడుతున్నాయి. చైనా, పాకిస్తాన్ ఎక్కువగా మాట్లాడటానికి కారణం ఇదే. కానీ తాలిబాన్లను గుర్తించడానికి అమెరికా సిద్ధంగా లేదు.