శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (14:52 IST)

పొల్లాచ్చి లైంగిక దాడి కేసు : ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌షిప్.. అడవుల్లో అత్యాచారం.. వీడియో

అపరిచితులను నమ్మిన కొందరు విద్యార్థినిలు ప్రమాదంలో చిక్కుకున్నారు. ముక్కూమొహం తెలియని వారితో స్నేహం చేసిన పాపానికి చిక్కుల్లో చిక్కుకుని బలైపోతున్నారు. నగ్న వీడియోలను మొబైల్ ఫోన్‌లలో చిత్రీకరించి, బెదిరించి కామ వాంఛ తీర్చుకుంటున్నారు దుర్మార్గులు. 
 
ఇటీవల తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌లలో దాదాపు 100కు పైగా అశ్లీల వీడియోలు ఉన్నాయని సమాచారం. 200 మందికి పైగా బాధితులు ఉండవచ్చని అంచనా. ఈ విషయంలో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇందులో ప్రముఖుల హస్తం కూడా ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. 
 
కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి చెందిన తిరునావుక్కరసు అదే ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినితో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో అతను తన స్నేహితులను పరిచయం చేస్తానని ఫిబ్రవరి 12న ఆమెను కార్లో తీసుకువెళ్లాడు. ఉసిలంపట్టి అనే ప్రాంతంలో తిరునావుక్కరసు నలుగురు మిత్రులు కార్లో ఎక్కారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అందరూ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. లైంగికవాంఛ తీర్చమని ఒత్తిడి చేశారు. ఈ విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులతో మొరపెట్టుకుంది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో శబరి, వసంతకుమార్‌, సతీష్‌కుమార్‌లను పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు తిరునావుక్కరసును గత వారం తిరుపతిలో పట్టుకున్నారు. 
 
ఇందులో ప్రముఖులకు కూడా సంబంధం ఉందంటూ అరెస్టుకు ముందు తిరునావుక్కరసు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనల తెరవెనుక ముఠాలు, అధికారిక నేతల హస్తం ఉందని ఉదంతులు రావడంతో వ్యవహారం వివాదాస్పదమైంది. నిందితులను అరెస్ట్ చేసి వీడియోలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.