శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (21:51 IST)

రూ.3లక్షలకు బాలికను అమ్మేశారు.. గర్భం దాల్చలేదని టార్చెర్

బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ బాలికను ఓ వ్యక్తి మూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు. ఆమెను లైంగికంగా వేధించి.. గర్భం దాల్చలేదని హింసించాడు. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి పారిపోయింది. ఆపై పిల్లల హక్కుల సంస్థ కంట పడటంతో ఆ బాలిక పట్ల జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.
 
రాజస్థాన్‌లోని మారుమూల ధోల్‌పూర్‌ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను ఆమె తల్లి, సహజీవనం చేస్తున్న వ్యక్తి కలిసి గత ఏడాది 40 ఏళ్ల వ్యక్తికి రూ.3 లక్షలకు అమ్మేశారు. దీంతో ఆ వ్యక్తి ఆ బాలికను బాల్య వివాహం చేసుకున్నాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. 
 
ఆ బాలిక గర్భం దాల్చనందుకు భర్తతోపాటు అతడి కుటుంబ సభ్యులు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. వేధింపులు భరించలేని ఆ బాలిక ఆ ఇంటి నుంచి పారిపోయేందుకు పలుసార్లు ప్రయత్నించి విఫలమైంది.
 
కాగా, ఆ బాలిక ఇటీవల భర్త ఇంటి నుంచి పారిపోయింది. బాలల హక్కుల సంఘం బచ్‌పన్ బచావో ఆందోళన్ (బీబీఏ) కంట ఆమె పడింది. దీంతో ఆ బాలికను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.