1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (21:02 IST)

ఏపి భవన్ లో ఆంధ్ర మామిడిపండ్ల అమ్మకం

మామిడిపండ్లలో రారాజు 'బంగినపల్లి', హస్తినవాసుల జిహ్వచాపల్యాన్ని తీర్చేందుకు న్యూ ఢిల్లీలోని ఏపి భ‌వ‌న్‌లో కొలువైవున్నాయి.

ఈ సువర్ణావకాశాన్ని హస్తిన‌వాసులు సద్వినియోగం చేసుకోవాల‌ని ఆంధ్రా మామిడిపండ్లను కొనుగోలు చేసి మామిడిపండ్ల రుచులను ఆస్వాదించాలని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్ అభయ్ త్రిపాఠి, రెసిడెంట్ కమీషనర్ భావన సక్సేనా విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన మామిడి పండ్లను న్యూ ఢిల్లీలో విక్ర‌యాలు జ‌రిపేందుకు ఏపి మార్కెఫెడ్ సౌజన్యంతో ఏపి భ‌వ‌న్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మామిడిపండ్ల అమ్మకాల‌ను ఈ నెల 5వ తేదీ నుంచి (శుక్రవారం) 30వ తేదీ వరకు దేశ రాజధానిలోని ప్రజలకు అందుబాటులోనికి తెస్తున్నట్లు ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ భావన సక్సేనా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన మామిడి పండ్లను దేశ రాజధాని ప్రజలకు చేరువ చేసే సంకల్పంతో ఆంధ్ర ప్రదేశ్ మార్కెఫెడ్ సౌజన్యంతో మామిడిపండ్ల అమ్మకం కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

మామిడి పండ్లలో ప్రసిద్ధి చెందిన బంగినపల్లి మామిడి పండ్లను ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు నుంచి తెప్పించి ఈ కేంద్రంలో అమ్మకానికి సిద్ధంగా ఉంచామని, నేటి నుంచి ఈ నెల 30 వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 8 గంట‌ల వరకు అమ్మకాలు జ‌రుపుతామ‌న్నారు.

4 కేజీల ప్యాకింగ్‌లో గల ఈ మామిడి పండ్లను రూ.450 చొప్పున విక్ర‌యిస్తామ‌న్నారు. మామిడి పండ్ల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మార్కెఫెడ్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాము (9652098760 / 8688984808) అందుబాటులో ఉంటారని తెలిపారు.