శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు
భారత్ పాకిస్థాన్ వివాదంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ లక్ష్మణ రేఖను దాటారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఆయనపై పార్టీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శశిథరూర్ 'లక్ష్మణరేఖ'ను దాటాయని పార్టీ అంతర్గత వర్గాలు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్డులో గల కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు సీనియర్ నేతలు సచిన్ పైలట్, శశి థరూర్ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం థరూర్ వ్యాఖ్యలపై పార్టీ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలిసింది.
"మాది ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ. నాయకులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఇక్కడ ఉంటుంది. అయితే, ఈసారి శశిథరూర్ మాత్రం తన వ్యాఖ్యలతో హద్దులు మీరారు. ఆయన లక్ష్మణరేఖను దాటారు" అని ఓ పార్టీ ప్రతినిధి పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత అభిప్రాయాల వెల్లడికి ఇది సమయం కాదని, పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని తాజా సమావేశంలో అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది.