యూపీలో ఎస్పీ సహా 24 మంది మృతి.. మథురలో రక్తసిక్తానికి కారణం ఏమిటంటే?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మథుర సమీపంలోని జవహర్ బాగ్ పార్కుకు చెందిన స్థలం ఆక్రమణల తొలగింపు రక్తసిక్తమైంది. ఇందులో ఓ ఎస్పీతో సహా మొత్తం 24 మంది మృత్యువాతపడ్డారు. జవహర్ బాగ్ పార్కుకు చెందిన సుమారు 280 ఎకరాలను రెండేళ్ల క్రితం పలువురు ఆక్రమించారు. వీరు 'ఆజాద్ భారత వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రాహి' పేరుతో ఓ సంఘంగా ఏర్పడ్డారు. ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం ఆక్రమణలను తొలగించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ సమాచారం తెలుసుకున్న ఆక్రమణదారులు పక్కా ప్రణాళికతో వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. సుమారు మూడు వేల మంది ఆయుధాలతో పోలీసులపై విరుచుకుపడ్డారు. ఎల్పీజీ సిలిండర్లను పేలుస్తూ గ్రెనేడ్లు విసురుతూ బీభత్సం సృష్టించారు, చెట్లుపై నక్కి పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. మరికొందరు రాళ్లు రువ్వుతూ కత్తులతో దాడులకు దిగారు.
పక్కా ముందస్తు ప్రణాళికతో పోలీసులపై ఆక్రమణదారులు విరుచుకుపడ్డారు. ఈ స్థాయిలో దాడిని ఊహించని పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎస్పీ సహా మరో పోలీసు అధికారి ఆక్రమణదారుల చేతిలో హతమయ్యారు. మరో 23 మంది గాయపడ్డారు. మరోవైపు పోలీసులు, ఆక్రమణదారుల కాల్పుల్లో 22 మంది ఆక్రమణదారులు మృతి చెందారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది.