మంగళవారం, 17 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 మే 2016 (14:03 IST)

ఓటుకు నోటు ఇవ్వను... లక్ష్మీ నరసింహస్వామిపై ప్రతిజ్ఞ చేసిన విజయకాంత్

సాధారణంగా ఓటు వేసేందుకు డబ్బు తీసుకోమని ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించడం సహజం. కానీ, తమిళనాడులోని ప్రధాన రాజకీయ నేతల్లో ఒకరైన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ శైలి భిన్నంగా ఉంటుంది. ఆయన ప్రసంగించే స్టైల్ మొదలుకుని చేసే ప్రతి పనిలోనూ ఓ విభిన్నత కనిపిస్తుంది. 
 
తాజాగా ఆయన ఉళుందూరుపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన స్థానికంగా ఉండే లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ విషయమై ఆయన కుటుంబ సమేతంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఎండీకే - ప్రజాసంక్షేమ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కెప్టెన్‌ బరిలోకి దిగుతున్నారు. 
 
జాతకాలు, నాడీజ్యోతిష్యాలపై అపార నమ్మకం ఉన్న విజయకాంత్‌ ఈసారి తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్న ధీమాతో ఉన్నారు. ఈ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మంగళవారం ఉదయం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్‌గా హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 
విజయకాంత్‌ చేయి చాచి ప్రతిజ్ఞ చేస్తుండగా పక్కనే ఆయన సతీమణి ప్రేమలత, బావమరిది ఎల్‌కే సుధీష్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. స్వామివారికి తులసిమాల వేసి.. అర్చనలు కూడా చేయించుకున్నారు. అనంతరం సమీపంలో ఉన్న శివాలయంలో కూడా ఆయన పూజలు చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ తన పార్టీ అభ్యర్థులకు కూడా ఓట్ల కోసం నోట్లు పంపిణీ చేయరాదని విజ్ఞప్తి చేశారు.