1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (17:47 IST)

ఇకపై ఆలయాల్లో మహిళా పూజారులు.. సీఎం స్టాలిన్ అనుమతితో..?

Temple
మహిళలు పురుషులకు ధీటుగా అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. తాజాగా పురుషులకు ధీటుగా పూజారులుగా మారనున్నారు. తమిళనాడులోఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. త్వరలోనే తమిళనాడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆలయాల్లో మహిళా పూజారులు బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
ఆలయాల్లో పూజారులుగా వ్యవహరించేందుకు ఆసక్తి చూపించే మహిళలకు సంబంధిత శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం కొత్త కోర్సును కూడా తీసుకువస్తోంది.
 
దీనిపై రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు స్పందిస్తూ, హిందువులు ఎవరైనా పూజారులు కావొచ్చన్నప్పుడు మహిళలకూ ఆ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనుమతి అనంతరం మహిళలకు పూజారి శిక్షణ అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని 47 పెద్ద దేవాలయాలలో ఇప్పటికే తమిళంలో అర్చన జరుగుతోంది. అలాగే, తమిళంలో అర్చన చేయడంలో పూజారులకు శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. 
 
ఇకపోతే.. హిందూ దేవాలయాలలో మహిళా పూజారులపై చాలాకాలంగా చర్చ జరిగింది. పూజారుల ఉద్యోగంలో కూడా లింగ సమానత్వాన్ని నెలకొల్పాలని సామాజిక సంస్కర్తలు దీనిని సమర్థిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలు చేసిన కొద్ది నిమిషాల తరువాత, సోషల్ మీడియాలో ఈ చర్యకు వ్యతిరేకంగా విమర్శలు వచ్చాయి. రాబోయే రోజుల్లో, ఈ అంశం చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.