1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (09:02 IST)

రక్షణ వలయంలో దేశ రాజధాని

పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. భద్రత దళాలు దిల్లీని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాద దాడులకు అడ్డుకట్ట వేసేందుకు చెక్‌పోస్టుల దగ్గర తనిఖీలను ముమ్మరం చేశారు.

దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరుపుతామని శనివారం వచ్చిన ఓ ఈ-మెయిల్‌తో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భద్రతను పెంచారు.

సింగపూర్‌ నుంచి వచ్చే ఇద్దరు అల్‌ఖైదా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడతారని ఆ మెయిల్లో ఉంది. అయితే ఆ బెదిరింపు అంత తీవ్రమైంది కాదని పోలీసులు చెబుతున్నారు.

ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం పొందిన ప్రభుత్వ అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా హాజరు కాకపోతే తీవ్రచర్యలు తీసుకుంటామని తెలిపారు.