శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

బాలికపై అత్యాచారం.. ఆపై గొంతుకోసి ప్రాణం తీసిన మృగాళ్లు.. ఎక్కడ?

దేశంలో ఆడపిల్లల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. పసిమొగ్గల నుంచి వృద్ధుల వరకు అత్యాచారాలకు గురవుతున్నారు. తాజాగా 16 యేళ్ళ బాలిక పట్ల కొందరు కామాంధులు దారుణంగా ప్రవర్తించార. బాలికను రేప్ చేసి, ఆపై గొంతుకోసి చంపేశారు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మెర్ జిల్లాలో వెలుగు చూసింది. 
 
బాధిత బాలిక కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి బాలిక ఇంట్లో నిద్రపోయింది. ఉదయం లేచి చూస్తే కనిపించలేదు. దీంతో ఆమె కోసం గాలించగా ఈ ఉదయం ఇంటి వెనక ఉన్న పొలాల్లో మృతదేహం లభ్యమైంది.  
 
బాధిత బాలిక పొరుగింట్లో ఉంటున్న ఇద్దరు యువకులను అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సువాలా గ్రామంలోని బాధిత బాలిక ఇంటి వెనక ఉన్న పొలాల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 
 
బాలికను గొంతు కోసి చంపేశారని, అంతకుముందు ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని భావిస్తున్నట్టు బర్మార్ సూపరింటెండెంట్ ఆనంద్ శర్మ తెలిపారు. అత్యాచారం జరిగిందా? లేదా? అన్నది పోస్టుమార్టం అనంతరం తెలుస్తుందన్నారు. 
 
ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు శర్మ పేర్కొన్నారు. విషయం తెలిసిన గ్రామస్థులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.