Doctors: వైద్యులపై ఇనుప రాడ్లు, పదునైన ఆయుధాలతో దాడి.. ఎందుకు.. ఎక్కడ?
టోమో రిబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (టీఆర్ఐహెచ్ఎంఎస్)లో గురువారం ఇద్దరు వైద్యులపై 28 ఏళ్ల వ్యక్తి ఇనుప రాడ్లు, పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని ఏకైక వైద్య కళాశాలలోని ఈఎన్టీ వార్డులో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగిందని వారు తెలిపారు.
నహర్లాగున్ పోలీస్ స్టేషన్లో చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దుఖుమ్ రైనా ఫిర్యాదు మేరకు దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. తనకు తెలిసిన రోగికి అందించిన చికిత్స పట్ల దుండగుడు అసంతృప్తిగా ఉన్నాడని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
పీడియాట్రిక్ విభాగంలో సీనియర్ రెసిడెంట్ అయిన డాక్టర్ అరవింద్ పుషాను వెనుక నుండి ఇనుప రాడ్తో కొట్టి, ఆ తర్వాత కడుపు, తలపై పదే పదే గుద్దినట్లు, తన్నినట్లు అధికారి తెలిపారు. మరో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ టామ్ టారియాంగ్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, దాడి చేసిన వ్యక్తి పదునైన ఆయుధంతో అతని వైపు తిరిగి, తీవ్ర గాయాలపాలు చేశాడని ఆయన అన్నారు.
డ్యూటీలో ఉన్న నర్సులు అలారం మోగించడంతో, రోగులు, సిబ్బందిలో భయాందోళనల మధ్య దాడి చేసిన వ్యక్తి వార్డు నుండి పారిపోయేలా చేశారు. గాయపడిన వైద్యులు చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని ఖండిస్తూ, అరుణాచల్ ప్రదేశ్ ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రి బియురామ్ వాగే సీరియస్ అయ్యారు. వైద్యుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) కూడా ఈ దాడిని ఖండించింది. ఇది రాష్ట్ర ప్రజల ఆరోగ్య హక్కులను దెబ్బతీసే అనాగరికమైన, అమానవీయ చర్యగా అభివర్ణించింది.