శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (05:36 IST)

వాడు ఔరంగజేబు.. నేను షాజహాన్.. అతనిపై దండయాత్ర (పోటీ) చేస్తా : ములాయం

తన తనయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నిప్పులు చెరిగారు. తన కుమారుడిని ఏకంగా ఔరంగజేబుతో పోల్చారు. పైగా, తనయుడిపై దండ్రయాత్ర (పోటీ) చేయనున్నట్టు ప్రకటించా

తన తనయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నిప్పులు చెరిగారు. తన కుమారుడిని ఏకంగా ఔరంగజేబుతో పోల్చారు. పైగా, తనయుడిపై దండ్రయాత్ర (పోటీ) చేయనున్నట్టు ప్రకటించారు. 
 
సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు చివరికి పార్టీని నిట్టనిలువునా రెండుగా చీల్చిన విషయం తెల్సిందే. ఈ పరిణామ క్రమంలో ఆ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌ను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సారథ్యంలో ఏర్పాటైన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ పరిణామంతో ములాయం సింగ్ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం కార్యకర్తలతో ములాయం భేటీ అయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమైతే తన కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌పై పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీని కాపాడేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తున్నా అఖిలేశ్‌ దాన్ని అర్థం చేసుకోవడం లేదని ములాయం విమర్శించారు. 
 
‘మూడు సార్లు అఖిలేశ్‌ను పిలిచి మాట్లాడేందుకు ప్రయత్నించా. ఒక్క నిమిషం ఉండి నేను మాట్లాడటం ప్రారంభించగానే వెళ్లిపోయేవాడు’ అని ములాయం పార్టీ కార్యకర్తలకు తెలిపారు. అఖిలేశ్‌ ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని, రాంగోపాల్‌ యాదవ్‌ చెప్పినట్లు ఆడుతున్నాడని ములాయం ఆరోపించారు. రాంగోపాల్‌ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని దుయ్యబట్టారు. 
 
రాష్ట్ర డీజీపీగా ముస్లింను నియమిస్తామని తాను హామీ ఇచ్చినప్పుడు అఖిలేశ్‌ 15 రోజులు తనతో మాట్లాడలేదన్నారు. అఖిలేశ్‌ ముస్లిం అభ్యర్థులు ఎవ్వరికీ టికెట్లు ఇవ్వడం లేదని, దీనికి రాంగోపాలే కారణమని ములాయం ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ కార్యకర్తల భేటీలో ములాయం తనను షాజహాన్‌గాను, అఖిలేశ్‌ను ఔరంగజేబుగాను అభివర్ణించి, ఆవేదన వ్యక్తం చేసినట్లు భేటీకి హాజరైన కొందరు నేతలు తెలిపారు.