మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్కు వచ్చిన ఫ్లైట్
తమ దేశంలోని అక్రమ వలసదారులపై కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్నెర్రజేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా తమ దేశంలోకి ప్రవేశించిన వలసదారులపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులోభాగంగా, తమ దేశం నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తున్నారు. సరైన ధృవపత్రాలు లేకుండా, చట్టవిరుద్దంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన భారత పౌరులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపించారు. దాంతో 205 మంది భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సీ17 బుధవారం మధ్యాహ్నం అమృతసర్లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
ఈ ప్రత్యేక విమానంలో స్వదేశానికి వచ్చినవారంతా పంజాబ్, దాని చుట్టుపక్కలవారిగా గుర్తించారు. వీరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత విమానాశ్రయం నుంచి బయటకు పంపించారు. ఇక రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు వచ్చే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇదిలావుంటే, అమెరికాలో హోలాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20407 మంది భారతీయుల వద్ద సరైన ధృవపత్రాలు లేనట్టు తేలింది. వీరిలో 17940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 1467 మంది ఈఆర్ఓ నిర్బంధంలో ఉన్నారు. తొలి విడతగా 205 మందిని వెనక్కి పంపించారు.