1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (13:42 IST)

ఉత్తరప్రదేశ్‌‌లో తొలి జికా వైరస్ కేసు.. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఒకరికి..

దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే మరోవైపు జికా వైరస్‌ దేశంలో మెల్లగా విస్తరిస్తోంది. ఉత్తరప్రదేశ్‌‌లో తొలి జికా వైరస్ కేసు బయటపడింది. కాన్పూర్‌లోని పోఖాపూర్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఒకరికి ఈ వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు.
 
పేషెంట్స్ శాంపుల్స్ పరీక్షల కోసం పుణె పంపగా.. నివేదకలో పాజిటివ్ అని తేలిందని, దీంతో ఆ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ శానిటైజ్ చేసిందని చెప్పారు. పేషెంట్‌తో సన్నిహత సంబంధాలున్న 200 మందిని ఐసొలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కాన్పూర్ చీఫ్ మెడికల్ అధికారి నేపాల్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఆరోగ్య శాఖతోపాటు స్థానిక సంస్థల అధికారులను అప్రమత్తం చేశారు. జికా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
 
దేశంలో ఉత్తరప్రదేశ్ కంటే ముందు కేరళ, మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. జికా వైరస్‌ ఏడిస్‌ దోమల ద్వారా వ్యాపిస్తుంది. జికా వైరస్‌ను 1947లో కోతుల్లో మొదటిసారి గుర్తించారు. 1952లో ఉగాండాలో మనుషుల్లో గుర్తించారు. ఉగాండాలోని 'జికా' అనే అడవి పేరు ఈ వైరస్‌కు పెట్టారు.