గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (15:37 IST)

ఆస్తి పంచి ఇవ్వలేదనీ.. బావతో కలిసి తండ్రిని హత్య చేసిన కొడుకు?

ఓ కిరాతక కుమారుడు కన్నతండ్రిని కత్తితో పొడిచి చంపేశాడు. ఆస్తి పంచి ఇవ్వలేదన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన బావ సహకారంతో ఈ హత్య చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ జిల్లా కొత్వాలి పట్టణం సీతాపూర్‌ ఏరియాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కౌషాంబి జిల్లాలోని బరియావా గ్రామానికి చెందిన అర్జున్‌లాల్ దివాకర్‌ను తన కుమారుడు తరచూ ఆస్తి పంచి ఇవ్వాలని వేధించేవాడు. కొడుకు చర్యలకు విసుగు చెందిన అర్జున్‌లాల్‌ చిత్రకూట్‌లో సీతాపూర్ పట్టణంలోని తన అల్లుడి ఇంటికి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. 
 
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెద్దకొడుకు రాజ్‌కుమార్‌ దివాకర్‌ తన బావ శైలేశ్‌ చౌదరి, మరో స్నేహితుడితో కలిసి ఈ నెల 18న చిత్రకూట్ చేరుకున్నారు. తెల్లవారుజాము 5 గంటలకు టెర్రస్ మీద నిద్రిస్తున్న అర్జున్‌లాల్‌ను వారు కత్తులతో దారుణంగా పొడిచి మత్య చేశారు. 
 
వృద్ధుడి అరుపులకు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో నిందితులు తమ బైక్‌ను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు బైక్‌ నెంబర్‌ ఆధారంగా హత్యకు పాల్పడింది అర్జున్‌లాల్‌ పెద్ద కుమారుడిగా గుర్తించి కేసు నమోదు చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.