ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (09:28 IST)

రష్యాలో ఉన్న వ్యక్తికి భారత్‌లోని టీకాల కొరత తెలిసింది... కానీ కేంద్రానికి తెలియదా?

ఎక్కడో రష్యాలో ఉన్న వ్యక్తి భారత్‌లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడుతుందని పసిగట్టగలిగారు. కానీ, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రహించలేకపోయిందనీ ఢిల్లీ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. పైగా, దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత, విధి విధానాలపై మరోమారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ జోరుగా సాగుతోంది. అదేసమయంలో వ్యాక్సినేష్ కార్యక్రమం కూడా సాగుతోంది. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియను టీకాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. 
 
కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో అందరకీ వ్యాక్సిన్‌ అందించడం ఒక్కటే ఉత్తమ మార్గమని చెబుతున్నప్పటికీ.. ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం పట్ల విచారం వ్యక్తం చేసింది. అంతేకాకుండా భారత్‌లోని వ్యాక్సిన్‌ తయారీ సంస్థల గురించి రష్యాలో ఉన్న వ్యక్తికి తెలిసిన విషయం కేంద్రానికి తెలియదా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 
 
‘సెకండ్‌ వేవ్‌ సమయంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. బాధ్యతగల పౌరుడిగా మీకు కూడా అదే ఆవేదన ఉంటుంది. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్‌ కొరత ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. ఈరోజు కూడా ఢిల్లీలో వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. దేశంలో ఎన్నో మంచి ఉత్పత్తులు ఉన్నాయి. వాటికి చిన్నపాటి చేయూత ఇస్తే చాలు’ అని సుత్నిక్‌ వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న పనేషియా బయోటెక్‌ అనే సంస్థ ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. 
 
దీనిపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎక్కడో రష్యాలో ఉన్న ఓ వ్యక్తి హిమాచల్‌లో ఉన్న వ్యాక్సిన్‌ తయారీ సంస్థను గుర్తించగలిగారు. కానీ, అలా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యింది’ అని స్పష్టంచేసింది. దేశంలో వనరులున్నప్పటికీ వ్యాక్సిన్‌ తయారీలో వాటిని కేంద్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.
 
ఇన్‌ఫ్లూయోంజా వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించి 2010లో ఓ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై పనేషియా బయోటెక్‌ హైకోర్టును ఆశ్రయించింది. 2019లో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాలని కోరింది. దీంతో విచారణ చేపట్టిన దిల్లీ హై కోర్టు.. పనేషియా బయోటెక్‌కు రూ.14కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.