మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 మే 2021 (20:39 IST)

కాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు.. అది భారత అంతర్గత విషయం.. ఖురేషి

పాకిస్తాన్‌ ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కాశ్మీర్ విషయంలో అధికార ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఆ పార్టీ విదేశాంగ మంత్రి పెద్ద షాక్ ఇచ్చారు. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు భారత్ అంతర్గత విషయమే నంటూ పాక్ విదేశాంగ మినిస్టర్ మహ్మూద్ ఖురేషి పేర్కొన్నారు.
 
ఖురేషి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన భారత్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం తొలగించడాన్ని ఆయన సమర్థించారు. అది పూర్తిగా భారత్ అంతర్గత విషయమని అన్నారు. అంతేకాకుండా ఈ విషయంపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేయడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు.
 
ఇక భారత్‌-పాక్‌ మధ్య ఇతర విషయాల్లో ఉన్న విభేదాలు కూడా కేవలం చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఖురేషీ వెల్లడించారు. తాము యుద్ధాన్ని కాంక్షించమని, యుద్ధం ఎప్పుడూ ఆత్మహత్యా సదృశమని అందువల్ల ప్రతి విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ఆశిస్తున్నామని అన్నారు. 
 
ఏకంగా విదేశాంగ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఇమ్రాన్ ప్రభుత్వం ఇరుకున పడ్డట్లైంది. 2018లో 370 ఆర్టికల్ రద్దు సమయం నుంచి ఇమ్రాన్ ప్రభుత్వం భారత్‌ను ఈ విషయంలో వ్యతిరేకిస్తూనే ఉంది. 
 
కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు భారత్-పాక్ సంబంధాలు పూర్వ స్థితికి చేరుకోవంటూ అప్పట్లో ఇమ్రాన్ తేల్చి చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మంత్రి ఇలా చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది.