శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 నవంబరు 2022 (09:09 IST)

తల్లి సాయంతో తండ్రిని చంపి ముక్కలుగా కోసిన కుమారుడు.. ఎక్కడ?

murder
ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశంలో సంచలనం సృష్టించింది. తనను నమ్మి తనతో సహజీవనం చేస్తూ వచ్చిన ప్రియురాలిని హత్య చేసి, 32 ముక్కలుగా చేసి 18 రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో కిరాతక ప్రియుడు విసిరివేశాడు. ఈ ఘటనను ఇంకా మరిచిపోక ముందే.. అలాంటి ఘటనే ఇపుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగాల్ రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని బరూయ్‌పూర్ పరిధిలో ఉజ్వల్ చక్రవర్తి (55) అనే వ్యక్త రిటైర్డ్ నేవీ ఉద్యోగి. ఈయనకు భార్య శ్యామల, కుమారుడు జోయ్ చక్రవర్తి (25)లు ఉన్నారు. జోయ్ చక్రవర్తి పాలిటెక్నిక్ చదవుతున్నాడు. ఈ నెల 12వ తేదీన కాలేజీ ఫీజు చెల్లించే విషయంలో తండ్రీ తనయుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. 
 
ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన కుమారుడు బలంగా నెట్టేశాడు. దీంతో ఉజ్వల్‌ తలకు బలంగా చెక్క కుర్చీ తగలడంతో ఆయన అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. తర్వాత ఏం చేయాలో తోచక.. తండ్రిని గొంతు నులిమి హత్య చేసి, తల్లి శ్యామలతో కలిసి తండ్రి మృతదేహాన్ని తన పాలిటెక్నిక్ కిట్‌లోని రంపంతో ఆరు ముక్కలుగా కోశాడు. 
 
ఆ తర్వాత మూడు రోజులకు తన భర్త కనిపించడం లేదంటూ కుమారుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, వారిద్దరి మాటల్లో తేడాను గమనించిన పోలీసులు.. వారిద్దరినీ గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉజ్వల్ చక్రవర్తి తమను చిత్ర హింసలకు గురిచేస్తుండటంతో వాటిని భరించలేక హత్య చేసినట్టు అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. ఆరు ముక్కలుగా చేసిన శరీర భాగాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.