శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2020 (18:23 IST)

పొలాల్లో నాట్లు వేయాల్సింది పోయి.. రోడ్లపైకి వచ్చి చలికి వణుకుతూ..?: సోనూ సూద్

కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలిచిన హీరో సోనూసూద్ ప్రస్తుతం రైతులకు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. పంజాబ్‌ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ ఆందోళనను కొనసాగిస్తున్న ఢిల్లీ రైతుల ఆందోళనపై నటుడు సోనూసూద్‌ స్పందించారు.
 
'వి ది ఉమెన్‌ ' అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సోనూసూద్‌ మాట్లాడుతూ.. ''ఈ విషయంలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని వాదించాలనుకోవడం లేదు. అయితే ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాను. రైతులతో నాకు మంచి అనుబంధం ఉంది. పంజాబ్‌లో పుట్టి పెరిగాను. రైతులు చేస్తున్న ఈ పోరాటంలో కొంత మంది రైతులు ప్రాణాలు కూడా కోల్పోయారు. పొలాల్లో నాట్లు వేస్తూ ఉండాల్సిన రైతులు .. వారి కుటుంబంతో కలిసి రోడ్లపై వచ్చి చలికి వణుకుతున్నారు. ఇంకా ఎన్నిరోజులు రైతులు ఈ పరిస్థితుల్లో ఉంటారో తెలియడం లేదు. అయితే ఈ దృశ్యాల్ని ఎప్పటికీ మరచిపోలేం'' సోనూసూద్‌ ఆవేదన చెందారు.
 
కాగా  శనివారంతో రైతుల ఆందోళన 24వ రోజుకు చేరింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, క్రీడాకారులు, సినిమా తారలు, విపక్ష నేతలు రైతులకు మద్దతు తెలుపుతున్నారు. ఈ జాబితాలో సోనూ సూద్ కూడా చేరారు.