1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (17:23 IST)

మహిళ కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం.. వీడియోతో బెదిరింపులు

దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో 30 ఏళ్ల మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ వీడియోను చిత్రీకరించి బెదిరించారని బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ నెల మొదట్లో ఈ సంఘటన జరగగా కానిస్టేబుల్ సెప్టెంబర్ 13 న ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడి తల్లితో సహా ఐదుగురిపై ఈ వారం కేసు నమోదు చేయబడిందని అధికారులు తెలిపారు. నేరానికి సంబంధించి ప్రధాన నిందితుడిని మరియు అతని తల్లిని పోలీసులు అరెస్టు చేసినట్లు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అనురాధ గీర్‌వాల్ తెలిపారు. నిందితుడు బాధితురాలితో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్నాడు. 
 
ఏప్రిల్ నుండి వాట్సాప్‌లో ఆమెకు మరింత దగ్గరయ్యాడు. కొద్దిరోజుల కిందట అతను తన తమ్ముడి పుట్టినరోజు వేడుకకు బాధితురాలిని ఆహ్వానించాడు, అక్కడ ఆమెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు, అతని సోదరుడు మరియు పార్టీలో ఉన్న మరొక వ్యక్తి తనపై అత్యాచారం చేశారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. 
 
నిందితులు వీడియో కూడా చిత్రీకరించారని ఆరోపించింది బాధితురాలు. ప్రధాన నిందితుడి తల్లి తనను బెదిరించిందని, నిందితుడి బంధువు కూడా తనను చంపేస్తానని బెదిరించాడని, తన నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడని బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనపై తదుపరి విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు.