శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 మే 2021 (16:48 IST)

అక్షయ తృతీయ రోజు మంచి నీటిని దానం చేయాలట!

అక్షయ తృతీయ రోజున మంచినీటిని ఆహార ధాన్యాలను దానం చేయటం మరిచిపోకూడదు. అక్షయ తృతీయ రోజున కందిపప్పు, బియ్యం వంటి ధాన్యాలు కొనడం మంచిదని పండితులు చెబుతున్నారు. బంగారం, వెండితోపాటు ఎరుపు రంగు చీర లేదాఎరుపు రంగు వస్తువులు అనాథలకు, వృద్ధులకు, పేద రైతులకు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
అక్షయ తృతీయ తెల్లవారు జామున గోమాతను పూజ చేయడం విశేషం. గోమాతు గోధుమలు, పొట్టు, బెల్లం, అరటిపండు కలిపిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పసుపు, కుంకుమలు ఇతరులకు ఇవ్వడం మంచిది. 
 
అన్నదానం చేయడం ద్వారా దేవతలకే అన్నం పెట్టిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. ఈ రోజున పేదలకు కావాల్సిన వస్తువులను దానం చేస్తే రాజయోగం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వస్త్రాలు దానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. రోగాలు దరిచేరవు. మజ్జిగ లేదా నీటిని దానం చేస్తే విద్య ప్రాప్తిస్తుంది.
 
పెరుగుదానం చేస్తే పాప విమోచనం లభిస్తుంది. ఆహార ధాన్యాలు దానం చేస్తే ప్రమాదాలు, అకాల మరణాలు వంటివి దూరమవుతాయి. గోమాతలో దేవతలందరూ ఉంటారు కాబట్టి అరటిపండు ఇవ్వడం మంచిది. 
 
ఆకలితో అలమటించేవారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుందట. వారికి మరో జన్మ ఉండదట. నేరుగా శివసాన్నిధ్యం చేరుకుంటారట. అక్షయ తృతీయ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడట. 
 
దీంతోపాటు బెల్లం, నెయ్యి, పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుందట. అక్షయ తృతీయ రోజున నీటిని నువ్వులతోకలిపి దానం ఇస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని పద్మపురాణంలో వుంది. 
 
నేరపూరిత స్వభావంతో కాకుండా అనుకోకుండా, తెలియకుండాచేసిన తప్పులకు మాత్రమే ఇలా పరిహారం అవుతుందట. కనుక అలాంటి తప్పులు చేసినవారు అక్షయ తృతీయ ఆ దానం ఇచ్చి చూస్తే ఫలితం కనబడుతుంది. 
 
అక్షయ తృతీయ రోజున అవసరం వున్నవారికి ఔషధాలను దానం ఇస్తేఆయురారోగ్యాలు కలిగి, అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు చెబుతున్నాయి. బియ్యం, వెండి, పంచదార దానం చేయడంవల్ల కలిగే ఫలితాల గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది. 
 
ఈ దానాలవలన మీ జాతకంలో వున్న చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి. వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు. సకల శుభాలు కలిగేలా అనుగ్రహిస్తాడట. ఇతరులకు చదువును దానం ఇస్తే దాంతో ఏడేడు జన్మల పుణ్యఫలితం లభించి మోక్షం పొందుతారట. మామిడిపళల్ళు, విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది.
 
అక్షయ తృతీయ నాడు సంబా గోధుమను బాగా ఉడికించి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం మంచి ఫలితాలనిస్తుంది. కుబేర లక్ష్మి, లక్ష్మి నారాయణ, లక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే గోధుమతో చేసే స్వీట్లు నైవేద్యంగా సమర్పించవచ్చు. 
 
అలాగే ఈ రోజు పుణ్యతీర్థాల్లో స్నానమాచరించడం వల్ల వేయి గోమాతలను దానం చేసిన ఫలితం దక్కుతుంది. ఇంకా పెద్దలచే ఆశీస్సులు పొందడానికి ఇది ఉత్తమమైన రోజని పండితులు చెబుతున్నారు. ప్రత్యేకంగా శ్రీమహాలక్ష్మిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. 
 
కొన్ని ప్రాంతాల్లో గౌరీదేవికి డోలోత్సవం, కృష్ణునికి డోలోత్సవం చేస్తారు. ముతె్తైదువులు, కన్యలు ఈ పూజలో పాల్గొంటారు. పూజ అయ్యాక పండ్లు, తీపి పదార్థాలు, నానవేసిన సెనగలను వాయనమిస్తారు. ఈ రోజు అక్షయ తదియ వ్రతాన్ని చేసుకునేవారు ఉప్పును మానేసి పంచదార కలిపిన పేలపిండిని భుజిస్తారు. 
 
తులసి ఆకులతో విష్ణుసహస్రనామ పారాయణ చేయడంతో అనంత పుణ్యఫలం లభిస్తుంది. గోధుమలు దానం చేస్తే ఇంద్రుడు యొక్క అనుకూలతతో వర్షాలు చక్కగా కురిసి అన్నాదులకు లోటు కలగదు. పానకం, వడపప్పు, మామిడిపళ్లు శ్రీ మహా విష్ణువుకి నివేదించడం మంచిది.