గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 నవంబరు 2020 (11:12 IST)

కార్తీక సోమవారం.. శివాలయాల్లో నేతితో దీపమెలిగించే వారికి..?

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకం.. అందులోనూ సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. ప్రతిఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది.

ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్ధశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు విశేషంగా పూజలు చేస్తుంటారు.

కార్తీకమాసం వచ్చిందంటే ఆ నెల రోజులూ పండుగదినాలే. దేశ నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు.
 
ఇక, కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. భ్రమరాంబ మళ్లికార్జున స్వామివారి సాధారణ దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతోంది. 
 
కార్తీక సోమవారం శివునికి ప్రీతికరం కావడంతో శివాలయాలను దర్శించడం శుభం. ఈ మాస ప్రారంభం నుంచి సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, స్త్రీలు నదులలో, కోనేటిల్లో దీపాలు వదులుతారు. ఇంకా కార్తీక మాసంలో దీపాన్ని దానం ఇస్తే... మాంగల్యబలం, కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. 
 
అలాగే కార్తీక సోమవారం నాడు శివాలయాల్లో నేతితో దీపమెలిగించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సోమవారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలకు చేరుకుని పంచముఖం గల దివ్వెలతో దీపాలను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.