గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2022 (20:26 IST)

కార్తీక మాసం మొదటి రోజు.. నెయ్యి దానం చేస్తే.. ఉసిరికాయలు..?

కార్తీకమాసం చాలా పవిత్రమైనది. కార్తీకమాస సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు చేస్తుంటారు. చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రంలో కలిసి వుండటమే కార్తీకం. ఉసిరికాయలు కార్తీక మాసం 30 రోజులు తీసుకోరాదు. 
 
కార్తీక మాసం అంతా ప్రతి రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్తీక శుద్ధ పాడ్యమి అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు బలి పాడ్యమి, గోవర్ధన పూజ అని అనేక పేర్లతో పిలుస్తారు. 
 
కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం. కార్తీక మాసం మొదటి రోజు అగ్నికి సంబంధించిన పూజలు చేయాలి. అగ్నిదేవుడిని స్తుతించాలి. అలాగే కార్తీక మాసంలో అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్య ఫలం లభిస్తుంది. కార్తీక మాసం మొదటి రోజు ఆవునెయ్యిని దానంగా ఇస్తే మనకు అష్టైశ్వర్యాలు  చేకూరుతాయి.
 
అగ్ని సంబంధమైనటువంటి దీపారాధన చేయడం ద్వారా ఆ ఇంట్లోకి శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కార్తీకమాసమంతా ఇంట్లో దీపాలు పెట్టడం మంచిది. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై వుంటుంది. 
 
కార్తీక మాసం మొదటి రోజును బలి పాడ్యమి అంటారు. కార్తీక మాసం మొదటి రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా మామిడి తోరణాలు, పుష్పాలతో అలంకరించాలి.
 
ఇలా చేస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది. ఇంట్లో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టాలి. కార్తీక మాసం మొదటి రోజు దేవునికి పాయసం నైవేద్యంగా పెట్టాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.