శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

శనీశ్వరుడిని శనివారం ఇలా స్తుతిస్తే.. ఆ బాధలన్నీ వుండవు.. తెలుసా..?

కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. దీనిని అందజేసేది శనీశ్వరుడు.

ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే ఆయనను కర్మ ఫలదాత అంటారు. ఒడిదొడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శనిదేవుడు. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు.
 
సూర్యభగవానుడు, ఛాయా సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రుడు అనీ, ఛాయాసుతుడు అనీ అంటారు. నవ గ్రహాల్లో కీలకమైన శని.. జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లు సంచరిస్తాడు. అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు ఉంది. 
 
అయితే, రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుని వేడుకుంటారు. అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు. ఇక శనివారం నాడు ఆయనను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని నమ్మకం. శనివారం శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతికరమైన రోజు. 
 
అందుకే శనివారం విష్ణు ఆరాధన చేయాలి. అలాగే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటున్నారు. అలాగే భక్తితో " ఓం శం శనైశ్చరాయ నమః " 108 సార్లు ఉచ్ఛరిస్తే సమస్త శనిదోషాలు తొలగిపోతాయి.  
 
అలాగే శనివారం పూట.. 
సూర్యపుత్రో దీర్ఘదేహః
విశాలక్ష శ్శివప్రియ:
 
మందచార: ప్రసన్నాత్మా
పీడాం దహతు మే శని:
 
నమస్తే మంద సంజ్ఞాయ
శనైశ్చర నమోస్తు
 
ప్రసాదం మమదేవేశ
దీనస్య ప్ర్రణతస్యచ
 
నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమోస్తుతే
 
నమస్తే బభ్రు రూపాయ
కృష్ణాయచ నమోస్తుతే.. అనే శనీశ్వర మంత్రంతో స్తుతిస్తే ఏలినాటి దోషం తొలగిపోతుంది.