1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 27 డిశెంబరు 2019 (20:25 IST)

స్త్రీ తనను సంతృప్తి పెట్టిన పురుషుడికి ప్రాణం ఇస్తుంది... అహల్య కూడా అలాగే చేసింది...

కాలానికి, కామానికి దగ్గరి సంబంధం ఉంది. అకాల కామం అనర్థాలు తెచ్చిపెడుతుంది. సకాంలో జరగవలసిన పనులను అడ్డుకుంటుంది. నిజానికి కామం కాలాతీతమైనది. కానీ వేళకాని వేళ కామానికి దాసులై నాశనమైన వారి కథలు పురాణాల్లో ఎన్నో ఉన్నాయి.
 
దాండక్యుడు ఒక రాజు. అతడిది భోజ వంశం. అతి కాముకుడు. అందమైన స్త్రీ తారసపడితే ఆమెను అనుభవించే వరకూ స్థిమితంగా ఉండలేని తత్వం దాండ్యకుడిది. ఒకరోజు వేటాడేందుకు అడవికి వెళ్ళాడు. అక్కడో ఆశ్రమం కనిపించింది. అది భార్గవ మహర్షిది. అప్పటికే బాగా అలసి ఉన్న దాండక్యుడు సేదతీరడం కోసం ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. లోపల మహర్షి లేడు. ఆయన కూతురు ఉంది. చిన్న వయస్సు. చూడచక్కగా ఉంది. పెళ్ళీడుకు అప్పుడప్పుడే ప్రవేశిస్తున్నట్లుంది. ఒళ్ళంతా అదోలాంటి కాంతి, ఆ మునికన్యను చూడగానే దాండక్యుడికి మతిపోయింది.
 
కామేచ్ఛ ఎగచిమ్మింది. ఉన్నఫళాన ఆమెను బలవంతంగా ఎత్తిపట్టుకుని తన రథంపైన ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. దర్బలు, సమిధల కోసం వెళ్ళిన భార్గవ మహర్షి కొంతసేపటికి ఆశ్రమానికి చేరుకున్నాడు. కుమార్తె కనిపించలేదు. పరిసరాలు వెదికాడు. ప్రయోజనం లేదు. చివరికి దివ్యదృష్టి సారించాడు. విషయం అర్థమైంది. ఆగ్రహోదగ్రుడయ్యాడు. బంధుమిత్ర సపరివార సమేతంగా నశించిపొమ్మని దాండక్యుడిని శపించాడు. అలా దాండక్యుడు అంతరించిపోయిన ప్రదేశమే ఇప్పటి దండకారణ్యం. ఇక అహల్య, ఇంద్రుల ఎపిసోడ్ అందరికీ తెలిసిందే.
 
అహల్య.. గౌతమ మహర్షి భార్య. పురుషులను దాసోహం చేయించే అందం ఆవిడది. దేవతలకు ప్రభువైన ఇంద్రుడు సైతం ఆ అందం మాయలో పడ్డాడు. ఆమెను కామించాడు. మహర్షి లేని సమయం కనిపెట్టి ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను అనుభవించాడు. ఆ క్రీడ అలా సాగుతుండగానే గౌతముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. స్త్రీ తనను సంతృప్తి పెట్టిన పురుషుడికి ప్రాణం ఇస్తుంది. ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. అహల్య అలాగే చేసింది. భర్త కంటపడకుండా ఇంద్రుణ్ణి తన గర్భంలో దాచేసింది. అదే సమయంలో గౌతముడికి ఎక్కడి నుంచో పిలుపు వచ్చింది.
 
భార్యను కూడా వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. గౌతముడిని ఆహ్వానించిన వ్యక్తి సామాన్యుడు కాడు. అహల్యను చూడగానే దివ్యదృష్టితో అసలు విషయం తెలుసుకున్నాడు. లెక్క ప్రకారం మూడు ఆసనాలు సిద్ధం చేశాడు. రెండు చాలు కదా. మూడోది ఎవరికి అని గౌతముడికి సందేహం కలిగి యోగ దృష్టితో చూశాడు. అహల్య రహస్యం బయటపడింది. 
 
ఓహో.. ఈ పెద్ద మనిషి ఇంద్రుడి కోసం మూడో ఆసనం వేశాడా అని అనుకున్నాడు. ఇంద్రునిపై పట్టరాని కోపం వచ్చింది. సహస్ర భగడవుకమ్ము అని శపించాడు. కామాంధుడైన పర పురుషుని భార్యను రమించినందుకు ఒళ్ళంతా స్త్రీ జననాంగాలై ఇంద్రుడు దురవస్థ పొందాడు. పురాణాల్లో ఇలాంటివి లెక్కలేనన్ని. సీతను చెరబట్టిన రావణాసురుడు, ద్రౌపదిని బలాత్కరించిన కీచకుడు సర్వనాశమైపోయారు. కామం వల్ల ముప్పు తప్పదు.