అలిమేలు మంగమ్మా.... వసతి సముదాయం పూర్తి ఎప్పుడమ్మా..!
తిరుమల శ్రీవారితో పాటు తిరుచానూరు అలిమేలు మంగాపురం అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిత్యం 20 వేల నుంచి 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తిరుమల తర్వాత పెద్ద
తిరుమల శ్రీవారితో పాటు తిరుచానూరు అలిమేలు మంగాపురం అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిత్యం 20 వేల నుంచి 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తిరుమల తర్వాత పెద్ద పుణ్యక్షేత్రంలా తిరుచానూరు విరాజిల్లుతోంది. తితిదే కూడా ఈ ఆలయానికి అంతటి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేస్తోంది. ఇందులోభాగంగా యాత్రికుల వసతి కోసం భారీ సముదాయాన్ని నిర్మించతలపెట్టింది.
ఈ మేరకు తిరుచానూరుకు అత్యంత సమీపంలో బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న అత్యంత విలువైన 5 ఎకరాల భూమిని ప్రభుత్వం తితిదేకి కేటాయించింది. ఈ స్థలంలో 68 కోట్ల రూపాయలతో బహుళ అంతస్తు వసతి సముదాయం నిర్మాణం చేపట్టింది. 2013 సంవతవ్సరంలో నిర్ణయమైన దీనికి అన్ని 2014 సంవత్సరంలో టెండర్లు ఖరారు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు.
రెండేళ్ళలో అంటే ఈ యేడాది ఫిబ్రవరికి పనులు పూర్తి చేయాలని తితిదే నిర్ధేశించింది. ఈ గడువు ముగిసి 6 నెలల అవుతున్నా ఇప్పటిదాకా 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. 20 కోట్ల రూపాయల పనులు మాత్రమే అయ్యాయి. ఇంకా 48 కోట్ల రూపాయల మేర పనులు చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయ్యేందుకు ఇంకో యేడాదో ఒకటిన్నర ఏడాదో పట్టినా ఆశ్చర్యం లేదు. పనులు ఇంత నత్తనడకన సాగడానికి కారణాలు లేకపోలేదు.
తితిదే వైపు నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల కాంట్రాక్టరు తీరిగ్గా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఈ పనులను ఇటీవల దాకా ఎస్ఈ-3 పర్యవేక్షణలో జరిగాయి. తిరుమల, తిరుపతి మినహా మిగతా దేశమంతా తితిదే ఇంజనీరింగ్ పనులను ఆయనే పర్యవేక్షించాల్సి వచ్చేది. దీంతో తిరుచానూరు పీఏసి నిర్మాణంపై అంత దృష్టి పెట్టలేకపోయారు.
రెండు నెలల క్రితమే ఇంజనీరింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసిన ఈఓ సాంబశివరావు ఎస్ఈ-3 పరిధిని విభజించి ఎస్ఈగా ఉన్న రాములకు అప్పగించారు. ఇప్పుడు తిరుచానూరు పిఎసి నిర్మాణాన్ని ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఈ మార్పు తరువాత పిఎసి పనులు కాస్త ఊంపందుకున్నాయి.
మరోవైపు ధరలు పెరగడం వల్ల కాంట్రాక్టు పనులు గిట్టుబాటులా లేవని కాంట్రాక్టర్తో నిర్లప్తతో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ణయించే షెడ్యూల్ ధరల కంటే తితిదే ధరలు తక్కువగా ఉంటాయి. తితిదేలో కాంట్రాక్టు అంటే పెద్దగా ఆదాయం ఉండదన్న అభిప్రాయం ఇప్పుడు కాంట్రాక్టర్లలో ఉంది. అదీ సకాలంలో పూర్తయితేనే కొంత మేరకైనా లాభాలు దక్కుతాయి.
పనుల్లో ఏ మాత్రం జాప్యం జరిగినా ఆ లాభం కరిగిపోయి కనిపించకుండా పోతుంది. ఇప్పడు పిఏసి నిర్మాణంలో జరుగుతున్నది అదేనని తెలుస్తోంది. ఈ విషయమై ఎస్ఈ రాములను వివరణ కోరగా గడువు ముగిసిన తరువాత మరో ఆరునెలలు సమయం ఇచ్చాం. సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్పై ఒత్తిడి పెడుతున్నాం అని చెప్పారు. మరి ఎప్పటికీ ఈ నిర్మాణం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
