శ్రీవారి సేవా టికెట్లు కావాలా...? అయితే సారు కాదు మేడంను సంప్రదించండి!
తిరుమల శ్రీవారి సేవాటికెట్లను పొందడం ప్రస్తుతం చాలా సులువుగా మారిపోతోంది. సుప్రభాతం నుంచి అర్చన, తోమాల ఎల్-1 దర్శనాల వరకు ప్రతి ఒక్కటి ఈజీగానే దొరుకుతున్నాయి. టికెట్ల దొరకలేదన్న బాధ ఏ మాత్రం అవసరం లే
తిరుమల శ్రీవారి సేవాటికెట్లను పొందడం ప్రస్తుతం చాలా సులువుగా మారిపోతోంది. సుప్రభాతం నుంచి అర్చన, తోమాల ఎల్-1 దర్శనాల వరకు ప్రతి ఒక్కటి ఈజీగానే దొరుకుతున్నాయి. టికెట్ల దొరకలేదన్న బాధ ఏ మాత్రం అవసరం లేదు. కాల్ టు మేడం.. లేకుంటే ఒక్క మెసేజ్.. చాలు.. మీకు కావాల్సిన టికెట్ ఈజీగా దొరికిపోతుంది. అయితే టికెట్ ఈజీగా దొరకడం అంటే తితిదే నిర్ణయించిన రేట్లకు అనుకునేరు. ఏ మాత్రం కాదు. అంతకు 10 రెట్లు. ఇంతకీ ఎవరా మేడం. అనుకుంటున్నారా... అయితే ఇది చదవండి.
తితిదే ఛైర్మన్గా చదలవాడ క్రిష్ణమూర్తి రెండో సంవత్సరం కొనసాగుతున్నారు. ఆయన సతీమణి చదలవాడ సుచరిత. ప్రస్తుతం చదలవాడ సుచరిత రేణిగుంట రోడ్డులోని చదలవాడ క్రిష్ణతేజ డెంటల్ కళాశాలకు అధినేత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడైతే చదలవాడకు ఛైర్మన్ పదవి వచ్చిందో ఇక మేడంగారిని టిక్కెట్ల కోసం ఫోను సంప్రదింపులు ఎక్కువైపోయాయట. ఆమెకు తెలిసిన పరిచయాలో, కొత్తగా వచ్చిన పలకరింపులో ఏదైతే ఏముంది. ఎవరు ఫోన్ చేస్తే వారికి టికెట్... ఎన్ని కావాలంటే అన్ని. బాగా తెలిసిన వారైతే టికెట్ సాధారణ రేటుకే దొరుకుతుంది. దూరపు పరిచయాలైతే ఒక రేటు ఉంటుంది. ఇంకా దూరపు పరిచయాలైతే మరో రేటు ఉంటుంది. అదే సేవా టికెట్ల అధిక రేట్లు.
మొదటి సంవత్సరంలోనే చదలవాడ ఛైర్మన్గా ఉన్నప్పుడు సేవా టికెట్ల ద్వారా చదలవాడ సుచరిత కోట్ల రూపాయలు సంపాందించినట్లు ఆరోపణలు లేకపోలేదు. అయితే ఆరోపణలు తీవ్రస్థాయికి రావడంతో సారు (చదలవాడ క్రిష్ణమూర్తి) మేల్కొన్నారు. ఇప్పటికి ఇంక ఆపు అంటూ నచ్చజెప్పారనే వాదనలు కూడా ఉన్నాయి. దానితో అప్పట్లో ఆమె కొంతకాలం ఈ టిక్కెట్ల జోలికి రాకుండా ఉండిపోయారు.
ఆ తర్వాత సంవత్సరం పాలకమండలిని పొడిగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు మరో నిర్ణయం తీసుకున్నారు. ఇంకేముంది. షరామామూలే.. ఫోన్ల ద్వారానే అన్నీ జరిగిపోతాయి. తితిదే సూపరింటెండెంట్ల నుంచి ఛైర్మన్ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరితోనూ మేడం గారు మాట్లాడుతారట. మేడం ఫోనంటే తితిదే సిబ్బంది హడలి పోతారట. మేడం చెప్పండి అంటూ గౌరవంగా మాట్లాడాలి. లేకుంటే మేడం గారికి చిర్రెత్తుకొస్తుంది. తితిదే సిబ్బంది ఛైర్మన్ సార్కు ఇంత గౌరవం ఇస్తారో లేదో కానీ మేడంకు మాత్రం అంతకు రెట్టింపుగానే ఇచ్చేస్తున్నారనే వాదనలు కూడా లేకపోలేదు.
ఒకవేళ తితిదే సిబ్బంది మతిమరుపుతో ఏదైనా మాట్లాడిస్తే ఇక అంతే... మేడం గారికి కోపం విపరీతంగా వచ్చేస్తుంది. ఎవరైనా సరే చెడామడా తిట్టేస్తారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. అందుకే గత కొన్నినెలలుగా తితిదే ఛైర్మన్ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు వేరే శాఖకు మార్చాల్సిందిగా ఈఓకు అర్జీలు పెట్టుకుని వెళ్ళిపోయారనే ప్రచారం కూడా నడుస్తోంది. ప్రస్తుతం కూడా ఛైర్మన్ సతీమణి హవా తిరుమలలో కొనసాగుతోందని చెప్పుకుంటున్నారు. శ్రీవారి సేవా టికెట్లన్నీ ఏది కావాలంటే అది తీసిచ్చే సత్తా మేడంకు ఉందంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఛైర్మన్ కార్యాలయం నుంచి రాత్రి 10 గంటలకు కూడా తిరుమల జెఈఓ కార్యాలయంకు సిఫార్సు లెటర్లు వెళతాయంటే మేడంగారి సత్తా ఎలాంటిదో తెలిసే ఉంటుందంటున్నారు.