శుక్రవారం, 20 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 జూన్ 2025 (12:57 IST)

మద్యం మత్తులో రెచ్చిపోయిన పోకిరీలు ... బస్సును వెంబడిస్తూ అసభ్యకర చేష్టలు (Video)

drunken youths
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొందరు యువకులు మద్యంమత్తులో రెచ్చిపోయారు. నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. పట్టణంలో నానా హంగామా చేశారు. ఓ ప్రైవేటు స్కూలు వాహనంలో కూర్చొనివున్న ఓ విద్యార్థినిపై దాడి చేశారు. నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, భీమవరంలో శుక్రవారం కొందరు యువకులు పీకల వరకు మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చి వీరంగం సృష్టించారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ కాలేజీ బస్సులోని విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని నోటికి వచ్చినట్టు దుర్భాషలాడారు. తమపై ఎందుకు దాడి చేస్తున్నారంటూ ఆ విద్యార్థి ప్రశ్నించడంతో యువకులు మరింతగా రెచ్చిపోయారు. ప్రశ్నించిన యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. 
 
బాధితుడైన విద్యార్థి ప్రయాణిస్తున్న కాలేజీ బస్సును సైతం కొంతదూరం వెంబడించారు. బస్సు వెంటపడుతూ అసభ్యకరమైన చేష్టలు చేయడంతోపాటు నడి రోడ్డుపై డ్యాన్సులు చేస్తూ అలజడి సృష్టించారు. వారి ప్రవర్తనతో రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులు సైతం భయభ్రాంతులకు గురయ్యారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కొందరు మొబైల్ ఫోనులో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.