ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 13 అక్టోబరు 2018 (14:04 IST)

ఒంటి నిండా బంగారంతో శ్రీవారు - గరుడసేవకు ఏర్పాట్లు పూర్తి...!

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజు శనివారం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి క‌ల్ప వృక్షవాహనంపై తిరుమాఢ వీధుల్లో విహరించారు. బ‌కాసుర వ‌ధ‌ అలంకారంలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అనుగ్రహించారు. 
 
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
 
రాక్షసులు, దేవతలు చేసిన క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్పవృక్షవాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిచ్చాడు శ్రీనివాసుడు.
 
ఇదిలా ఉంటే రేపు గరుడసేవ జరుగనుంది. గరుడవాహనసేవకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షలాదిమంది భక్తులు వేచి ఉంచేందుకు గ్యాలరీలను సిద్థం చేశారు. ఎలాంటి తోపులాటలు జరుగకుండా క్యూలైన్లలోనే స్వామివారిని దర్సించుకునే విధంగా టిటిడి అన్ని ఏర్పాట్లు  చేసింది.