1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By వాసు
Last Updated : గురువారం, 4 జులై 2019 (16:09 IST)

అష్ట మహాదానాలు అని వేటిని అంటారు?

సనాతన సంప్రదాయంలో అష్ట మహాదానాలకు ఒక విశిష్టమైన ప్రాధాన్యత వుంది. గరుడ పురాణంలోని ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి చక్కగా వివరించారు. అందులో భాగంగా... 1. నువ్వులు, 2. ఇనుము, 3. బంగారం, 4. పత్తి, 5. ఉప్పు, 6. భూమి, 7. ఆవులు వంటి వాటిని దానంగా ఇవ్వవచ్చు. ఇక ఎనిమిదవ దానంగా ఏడు ధాన్యాలను చేర్చారు. ఇందులో గోధుమలు, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు ఉంటాయి. 
 
వీటిలో ఏదైనా ఒక్కదానిని లేదా అన్నింటినీ కలిపి దానంగా ఇవ్వవచ్చు. నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి 
ఉద్భవించాయి. నువ్వుల్లో మూడు రకాలు ఉంటాయి. వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇనుమును దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా తప్పించుకోవచ్చుననేది శాస్త్రం చెప్తోన్న మాట.
 
యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించి ఉంటాడు. దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరని చెప్తారు. భూమిని దానం చేయడం ద్వారా సమస్త భూతాలు సంతృప్తి చెందుతాయి. సువర్ణ దానం బ్రహ్మ, దేవతలు, మునీశ్వరులు సంతోషించేందుకు దోహదపడుతుంది. పత్తిని దానం చేయడం ద్వారా యమ భటుల భ‌యం 
ఉండ‌దు.

అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. గోదానంతో వైతరిణి నదిని దాటిపోవచ్చు. ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను దానం చేయడం ద్వారా యముడి నివాసానికి రక్షణగా వుండేవారు ఆనందిస్తారు.
 
ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు. ఉప్పు, నువ్వులు, ధాన్యాలు, పత్తిని దానం చేయవచ్చు. ఈ దానాలను చేయడం ద్వారా లేని వానికి మనకు ఉన్నంతలో ఇవ్వడమనే పరమార్థం కూడా ఉంది.