క్యూలైన్లలో శ్రీవారి భక్తులపై దురుసుగా ప్రవర్తించకండి : చదలవాడ
శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు మహిళా సేవకులు ఆప్యాయతానురాగాలతో సేవలందిస్తున్నారని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్లో శ్రీవారి సేవకులతో ఛైర్మన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ మహిళా సేవకుల్లో శ్రీ పద్మావతి అమ్మవారిని భక్తులు దర్శిస్తున్నారని చెప్పారు.
భక్తులను ఎళ్లవేలలా గోవింద, శ్రీనివాస, వేంకటేశ అని సంబోధించాలని సూచించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకునే సమయంలో హుండీ వద్ద భక్తులతో సున్నితంగా వ్యవహరించాలన్నారు. శ్రీవారి సేవకుల వస్త్రధారణ భక్తిభావాన్ని పంచుతోందన్నారు. లడ్డూ కౌంటర్లలో శ్రీవారి సేవకుల సేవలు అమోఘమన్నారు. త్వరలో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళలు, పురుష సేవకులు మరింత అంకితభావంతో భక్తులకు ఉన్నతమైన సేవలు అందించాలన్నారు.
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని ఇక్కడ భక్తులకు సేవలందించేందుకు 25 యేళ్ళ నుంచి 45 యేళ్ళలోపు గల శ్రీవారి సేవకులు ముందుకు రావాలని కోరారు. టిటిడిలో 2000 సంవత్సరంలో శ్రీవారి సేవను ప్రారంభించనప్పటి నుంచి ఇప్పటివరకు 6,81,000 మంది శ్రీవారి సేవకులు సేవలందించడం విశేషమన్నారు.
