1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (13:15 IST)

లాస్య నందిత కారు ప్రమాదానికి కారణం ఏంటి?

lasya nandita
హైదరాబాద్ నగరంలోని సుల్తాన్ పూర్ వద్ద ఓఆర్ఆర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆమె ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగిందన్నది మిస్టరీగా మారింది. పైగా, నందిత ముందు సీటులో కూర్చొని సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదం ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయినట్టు నిపుణులు అంటున్నారు. 
 
అయితే, మరికొందరు మాత్రం అనేక కారణాలు చెబుతున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మారుతీ సుజుకీ ఎక్స్ఎల్ 6 సేఫ్టీ తక్కువగా ఉంటుందని అంటున్నారు. ముందు సీటులో కూర్చున్న నందిత సీటు బెల్ట్ పెట్టుకోవడం ఒక కారణమని చెబుతున్నారు. సడన్ బ్రేక్ వేయడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా ముందు సీటును వేగంగా ఢీ కొట్టడంతో ఇంటర్నల్ పార్ట్స్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయని ఇది కూడా ఒక కారణమేనని నిపుణులు, వైద్యులు చెబుతున్న పరిస్థితి. 
 
మరోవైపు.. నార్కట్ పల్లిలో నందిత స్కార్పియో కారు ప్రమాదానికి గురైంది. అప్పుడే డ్రైవర్‌ను మార్చి ఉంటే నందిత ప్రాణాలు ఉండేవారేమోనని అనుచరులు చెబుతున్నారు. అంతేకాదు.. నాడు ప్రమాదానికి గురైన స్కార్పియో కారు ఉన్నా.. ఇంత ప్రమాదం జరిగేది కాదని చెబతున్న పరిస్థితి.
 
ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నల్గొండ వేదిగా భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం విదితమే. ఈ సభకు నందిత కూడా వెళ్లారు. తిరుగుపయనంలో నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద లాస్య ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే.. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు.