1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (10:36 IST)

కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్న 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : ప్రభుత్వ విప్

revanthreddy
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి ఇపుడు గడ్డుకాలం కొనసాగుతుంది. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోగానే పార్టీలోని నేతలంతా పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు. గత యేడాది డిసెంబరు నెలలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు ఇపుడు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు సిద్ధమైపోతున్నారు. తాజాగా మరో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. 
 
బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వారు రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలిపారు. ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలు అమలు చేస్తున్నామని... ఈ ప్రజాకర్షక పథకాలను చూసి వారు అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు చెప్పారు.
 
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటారన్నారు. ప్రజాసంక్షేమమే తమ పార్టీకి ముఖ్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సహా అందరికీ అందుబాటులో ఉంటారని, ప్రజా సంక్షేమమే తమకు ఖ్యమన్నారు.
 
కాగా, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున 39 మంది గెలిచినప్పటికీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ స్థానానికి మే 19వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది.