గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శనివారం, 15 డిశెంబరు 2018 (20:30 IST)

15 ఏళ్ల బాలికపై మోజు... నిశ్చితార్థం, అన్నీ తీరాక ఆ పని చేశాడు..

అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడేవారి గురించి వార్తల్లో మనం చూస్తూనే వుంటాం. మరో బాలిక జీవితాన్ని సర్వనాశనం చేసి ఆమె మరణానికి కారణమయ్యాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళితే... కర్నాటకకు చెందిన లక్ష్మీబాయికి 15 ఏళ్ల కుమార్తెతో హైదరాబాదులోని బేగంబజార్ కోల్సావాడిలో వుంటోంది. ఈమెకి భర్త లేకపోవడంతో కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. ఐతే ఆ బాలికపై ఓ యువకుడు కన్నేశాడు. నేరుగా ఆ బాలికను కదిలిస్తే ఏమవుతుందోనని తన తల్లిదండ్రులను రంగంలోకి దించాడు. 
 
తనకు ఆ బాలిక అంటే ఇష్టమని పెళ్లంటే చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని చెప్పాడు. 15 ఏళ్ల బాలిక గురించి కుమారుడు అలా చెప్తుంటే వారించాల్సిందిపోయి తల్లిదండ్రులు కూడా తానా అంటే తందానా అన్నారు. నేరుగా లక్ష్మీబాయి ఇంటికి వచ్చి తమ కుమారుడి మీ కుమార్తెపై మోజు పడ్డాడనీ, ఆమెను పెళ్లాడుతాడని చెప్పారు. ఐతే అందుకు లక్ష్మీబాయి అంగీకరించలేదు. అమ్మాయికి 18 ఏండ్లు నిండిన తర్వాతే పెళ్లి చేస్తానని చెప్పారు. కానీ వారు పట్టు విడిచిపెట్టలేదు. 
 
తమ తరపు బంధువులను తీసుకువచ్చి ప్రస్తుతం నిశ్చితార్థం చేసుకుందామనీ, 18 ఏండ్లు నిండాక పెళ్లి చేద్దామని ఒత్తిడి చేశారు. దీనితో ఒంటరి మహిళ అయిన లక్ష్మీబాయి కుమార్తె జీవితం బాగుంటుందన్న ఉద్దేశ్యంతో అందుకు అంగీకరించింది. దానితో నిశ్చితార్థం జరిగింది. ఇక అక్కడ నుంచి సదరు యువకుడు మనకు నిశ్చితార్థం జరిగింది కదా అంటూ ఆమెతో మాటలు కలిపాడు. ఆ తర్వాత పెళ్లి తర్వాత చేయాల్సినవన్నీ చేసేశాడు. ఆ ముచ్చట తీరేసరికి ఆమెకు మరో రూపం చూపించాడు. 
 
ఆమెను పెళ్లాడటం ఇష్టం లేదంటూ బాంబు పేల్చాడు. బాలిక వద్ద చెబితే ఏమవుతుందోనని విషయాన్ని తన తల్లిదండ్రుల వద్ద చెప్పి సైలెంట్ అయ్యాడు. అలా చెప్పిన కుమారుడికి బుద్ధి చెప్పాల్సింది పోయి... మళ్లీ కుమారుడి నిర్ణయానికి మద్దతిస్తూ లక్ష్మీబాయితో అదే విషయాన్ని చెప్పారు. దానితో ఆమె లబోదిబోమంటూ కన్నీరు పెట్టుకుంది. పెళ్లాడుతామని రెండేళ్లపాటు తన కుమార్తెతో తిరిగి ఇప్పుడు కాదంటే ఆమెను ఎవరు పెళ్లాడుతారంటూ ప్రశ్నించింది. 
 
సంక్రాంతి పండగ వెళ్లాక పెళ్లి చేద్దామని బ్రతిమాలింది. ఐతే ఆమె అభ్యర్థనను వారు తోసిపుచ్చారు. ఇదంతా ఎదురుగా కూర్చుని చూస్తున్న బాలిక పరుగెత్తుకుంటూ వెళ్లి మేడపైకి ఎక్కి కిందికి దూకేసింది. ఈ హఠత్పరిణామంతో కిందికి పరుగెత్తి చూడగా రక్తపు మడుగులో ప్రాణాలు విడిచి విగత జీవిగా మారిందా బాలిక. విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.