శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (19:45 IST)

బీజేపీలోకి ఈటల రాజేందర్ .. ముహూర్తం ఖరారు

భారతీయ జనతా పార్టీలోకి తెరాస మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరబోతున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 14వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ఈ నెల 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ కాషాయం కండువా కప్పుకోనున్నారు. 
 
తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్త‌‍రఫ్‌కు గురైన తర్వాత ఆయన తెరాస ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఇప్పటికే ఆయన బీజేపీలో పెద్దలతో చర్చలు జరిపారు. పార్టీ ఆగ్ర నేతల అపాయింట్మెంట్ ఫిక్స్ కావడంతో ఈ నెల 14న ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నారు. 
 
భూ కబ్జా ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల వ్యవహారం రోజుకో మలుపు తిరిగింది. ఈటల సొంతంగా పార్టీ పెడతారని.. లేదంటే బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈటల తన సన్నిహితులతో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని.. రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈటల బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 
 
మరోవైపు ఈటల ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 
 
స్పీకర్ పోచారం ఈటల రాజీనామాను ఆమోదం తెలిపితే.. హుజురాబాద్‌లో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈటలను రాజకీయంగా ఒంటరిని చేయాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఈటల వెంట టీఆర్ఎస్ నాయకులు వెళ్లకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. 
 
ఇప్పటికే మంత్రులు హరీష్‌ రావు, గంగుల కమలాకర్‌లు స్థానిక నాయకులు వరుస భేటీలు అవుతున్నారు. హుజురాబాద్‌లో బీజేపీకి గల బలంపై నాయకులు చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువగా 2 వేలలోపు ఓట్లు పోలు కాగా, ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్‌లో బీజేపీ విజయభేరీ మోగించింది. దీంతో బీజేపీని తెరాస తక్కువగా అంచనా వేయడం లేదు.