గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: సోమవారం, 14 సెప్టెంబరు 2020 (11:28 IST)

మరదలితో వివాహేతర సంబంధం, హైదరాబాదు శివారులో యువకుడు దారుణ హత్య

భార్య సోదరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి దారుణంగా హత్య చేసారు. హైదరాబాదు శివారులోని కంచన్ బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
 
పోలీసుల కథనం ప్రకారం ముషీరాబాద్‌కు చెందిన కారు డ్రైవర్ సయ్యద్ మునాఫర్ ఖాద్రి (27) చాంద్రాయణగుట్ట డివిజన్ హఫీజ్ బాబానగర్ ప్రాంతానికి చెందిన యువతిని ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప, నెలరోజుల బిడ్డ ఉన్నారు. తన అక్క బాలింత కావడంతో ఆమె సోదరి ఇక్కడికి వచ్చింది. ఇదే అదనుగా మునాఫర్ ఆమెపై కన్నేశాడు.
 
ఆమెను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఆమె కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. అయినప్పటికీ తీరు మార్చుకోని సయ్యద్ భార్య సోదరిని తీసుకుని ఇంటి నుండి వెళ్లి పోయాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చినప్పటికీ తన సంబంధాన్ని మాత్రం విడిచి పెట్టలేదు. దీంతో మాట్లాడుకుందాం రమ్మంటూ యువతి తండ్రి, తమ్ముడు అతడిని ఇంటికి పిలిపించారు.
 
ఈ సంబంధం మంచిది కాదని ఖాద్రీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు జరగడంతో యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఖాద్రిని పట్టుకుని కాళ్లు చేతులు కట్టేశారు. అనంతరం నడి రోడ్డుపైకి ఈడ్చుకొని వచ్చి మాంసం కోసే కత్తితో గొంతుకోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.