1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (08:15 IST)

వరద బాదిత కుటుంబాలకు ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే: హైదరాబాద్ మేయర్

వరద బాదిత కుటుంబాలకు ఇస్తున్న రూ. 10 వేల ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. ప్రతి వరద బాదిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.

వరదలతో ఇబ్బందులకు గురైన కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో మాత్రమే సి.ఎం రిలీఫ్ ఫండ్ ను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అధికారులు ప్రతి బాదిత కుటుంబం ఇంటికి వచ్చి ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు. 
 
బుధవారం ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్, కాప్రా సర్కిళ్లలోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు, డిప్యూటి కమిషనర్లతో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ వరద బాదిత కాలనీలలో పర్యటించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సి.ఎం రిలీఫ్ ఫండ్ రూ. 10 వేల చొప్పున అందజేశారు.

నాచారంలోని నీట మునిగిన హెచ్.ఎం.టి కాలనీలో పేదలు ఉండే గుడిసెల్లోకి వెళ్లి పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ వారికి నగదును అందజేశారు. ఆ తర్వాత మల్లాపూర్, చర్లపల్లి ప్రాంతాల్లో పర్యటించిన మేయర్, ఎమ్మెల్యేలు వారికి భరోసా ఇస్తూ రూ. 10 వేల నగదు సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బాదితులు ఇళ్లలోని సామాన్లతో పాటు అనేక వస్తువులు కోల్పోయామని మేయర్, ఎమ్మెల్యేల దృష్టికి తెచ్చారు. బాదితులకు ఉపశమనం కలిగించుటకు రూ. 10 వేల సహాయాన్ని ప్రభుత్వం ఇస్తున్నట్లు తెలిపారు. 

ప్రభుత్వం పూర్తిస్థాయి అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ...ఇంతటి భారీ విపతుల్లో ప్రజలను తక్షణం ఆదుకునేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ముఖ్యమంత్రి కె.సి.ఆర్, పురపాలక శాఖ మంత్రి కె.టి.ఆర్ లు తక్షణమే స్పందించి బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నారని వివరించారు.

ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ... ఉప్పల్ ప్రాంతం బాగా దెబ్బతినడంతో తనతో పాటు మేయర్, కార్పొరేటర్లు, అధికారులు రేయింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉండి సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.