బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 మే 2021 (11:14 IST)

ఐసోలేషన్‌లో ఉన్న ఉద్యోగులకు జీహెచ్ఎంసీ శుభవార్త!

కరోనా వైరస్ మహమ్మారి కాలంలో ఫ్రంట్‌లైన వారియర్స్‌గా సేవలు అందిస్తూ కరోనా వైరస్ బారినపడి ఐసోలేషన్‌లో ఉంటున్న ఉద్యోగులకు గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ శుభవార్త చెప్పింది. ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా రోగులకు పూర్తి వేతనం ఇవ్వనున్నట్టు జీహెచ్ఎంసీ తెలిపింది. 
 
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి రోజూ 1500 నుంచి 2000 మంది కార్మికులు వీక్లీ హాఫ్‌, వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యంతో గైర్హాజరవుతున్నారు. కోవిడ్‌తో పాటు ఇతరత్ర ఆరోగ్య సమస్యలతో విధులకు రావడంలేదని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. 
 
వీరిలో పాజిటివ్‌ వచ్చిందని తమ సెల్‌ఫోన్‌ ద్వారా వచ్చిన సమాచారాన్ని సంబంధిత సర్కిల్‌లోని అధికారులకు చూపిస్తే వారికి ఆయా ఐసొలేషన్‌ రోజుల వేతనాలను ఇస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
 
కాగా, ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉంటూ విశేష సేవలందిస్తున్న పారిశద్ధ్య కార్మికులకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అండగా నిలుస్తోంది. కోవిడ్ నియంత్రణకు అవిశ్రాంతంగా విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ అధిక ప్రాధాన్యమిస్తోంది. 
 
స్వీపింగ్‌ విధులు నిర్వహించే కార్మికులు, ఎంటమాలజీ వర్కర్లలో ఎవరైనా కోవిడ్‌ పాజిటివ్‌ వస్తే వారిని ఐసొలేషన్‌కు అనుమతిస్తూ మందులను కూడా ఉచితంగా అందిస్తోంది. దీంతోపాటు పూర్తి వేతనాన్ని అందిస్తోంది. గత సంవత్సరం తొలివిడత కరోనా నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.