1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 మే 2021 (12:54 IST)

ఆనందయ్య ఆయుర్వేదం : నిగ్గు తేల్చుతున్న ఆయుష్

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసి బోణిగి ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై నిగ్గు తేల్చేందుకు ఆయుష్ వర్గాలు రంగంలోకి దిగాయి. మందుపై శాస్త్రీయ అధ్యయనం జరిగాకే పంపిణీ అంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో, లోకాయుక్త కూడా ఈ అంశంపై దృష్టి పెట్టింది. ఆనందయ్య కరోనా మందుపై ఈ నెల 31న విచారణ జరపనుంది. దీనికి హాజరు కావాలని నెల్లూరు జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. కొవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించకూడదని లోకాయుక్త స్పష్టం చేసింది.
 
అటు, కృష్ణపట్నంలో పర్యటిస్తున్న ఆయుష్ అధికారులు ఆనందయ్య నుంచి మందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఆయుర్వేద మందు తయారీ విధానాన్ని ఆనందయ్య అధికారులకు వివరించారు. వివిధ పరీక్షల్లో ఆనందయ్య ఆయుర్వేద మందుపై సానుకూల ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆనందయ్యకు పూర్తిస్థాయిలో పోలీసు రక్షణ కల్పిస్తున్నారు.
 
మరోవైపు, ఆనందయ్య ఇచ్చే కరోనా మందు తీసుకున్న హెడ్మాస్టర్ కోటయ్య ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆనందయ్య మందుతో కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయని శుక్రవారం వరకు జోరుగా ప్రచారం జరిగింది. అయితే, శనివారం కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆనందయ్య మందుపై సందేహాలు అలముకున్నాయి.
 
ఇదిలావుంటే, పోలీసులు ఆనందయ్య కరోనా ఔషధం పంపిణీ చేస్తున్న కేంద్రాన్ని ఖాళీ చేయించారు. పంపిణీ సామగ్రిని తమ అధీనంలోకి తీసుకున్నారు. మందు పంపిణీ నిలిపివేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.