1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

అనుమానంతో ప్రియురాలిని చంపి సంపులో పడేసిన ప్రియుడు!

హైదరాబాద్ నగరంలో ఓ ప్రియుడు కిరాతకంగా ప్రవర్తించాడు. అనుమానంతో ప్రియురాలిని చంపి, ఆపై సంపులో పడేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సోమేశ్వరరావు మూసాపేటలో నివాసముంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. ఇతని కుమార్తె మంజుల (19) ఇంటర్‌ పూర్తి చేసి ఇంటిపట్టునే ఉంటోంది. 
 
అయితే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన భూపతిజైపాల్‌(21) బీటెక్‌ రెండో ఏడాది వరకు చదివి ఆపేశాడు. ప్రస్తుతం కూకట్‌పల్లి పాపారాయుడునగర్‌లో నివాసముంటూ ఖాళీగా ఉంటున్నాడు.  
 
భూపతిజైపాల్‌, మంజుల వరుసకు బావమరదళ్లు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకొన్నారు. కొంతకాలంగా మంజుల మరొకరితో తరచూ మాట్లాడటం, చనువుగా ఉండటం గమనించిన భూపతి ఆమెతో గొడవ పడ్డాడు. ఇలా పలు మార్లు గొడవలు జరిగాయి. 
 
ఈ నెల 10న తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో మంజులకు ఫోన్‌ చేసి మాట్లాడుకొందాం... రా అంటూ ఇంటికి పిలిపించాడు. మంజులపై ఉన్న అనుమానాన్ని మరోసారి భూపతి ప్రస్తావించడంతో మంజుల ఎదిరించింది. కోపోద్రిక్తుడైన భూపతి వెంటనే మంజుల గొంతును గట్టిగా నులిమి చంపేశాడు.
 
శనివారం మధ్యాహ్నం మంజులను హత్య చేసిన తర్వాత భూపతి శవాన్ని ఇంట్లోని సంపులో పడేశాడు. భయంతో తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఫ్యానుకు ఉరేసుకోవాలని ప్రయత్నించి విరమించుకొన్నాడు. 
 
ఇంట్లో నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు తిరిగాడు. అదేరోజు రాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మంజుల తల్లిదండ్రులు ఆదివారం రాత్రి శ్రీకాకుళం నుంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.