1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2023 (11:20 IST)

ఆదివారం మధ్యాహ్నం 1.20 గంటలకు తెలంగాణ సచివాలయం ప్రారంభం

New Secretariat
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ నూతన సచివాలయాన్ని ఈ నెల 30వ తేదీ ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన ఆరో అంతస్తులోని తన కార్యాలయంలో మధ్యాహ్నం 1.20 గంటలకు ఆసీనులవుతారు. అంతకుముందు ఆదివారం ఉదయం 5 గంటల నుంచి నిర్వహించే పూజా కార్యక్రమాలను రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇతర అధికారులు పర్యవేక్షిస్తారు. సుదర్శన యాగం పూర్ణాహుతిలో మధ్యాహ్నం ముఖ్యమంత్రి పాల్గొంటారు. 
 
సీఎం తన ఛాంబర్‌లో ప్రవేశించిన అనంతరం.. సీఎస్‌, మంత్రులు, కార్యదర్శులు కూడా తమ ఛాంబర్లలో ఆసీనులవుతారు. తర్వాత మధ్యాహ్నం 2.15 గంటలకు సచివాలయం ప్రాంగణంలో సమావేశం ఉంటుంది. ఇందులో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే సచివాలయ అధికారులు, సిబ్బంది అందరూ మధ్యాహ్నం 12 గంటల్లోపే హాజరవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. 
 
అందరూ తప్పనిసరిగా గుర్తింపు కార్డులు, వాహన పాసులను తెచ్చుకోవాలని సూచించారు. వాహనాల పాసులను బీఆర్‌కే భవన్‌లోని మూడో అంతస్తులో సాధారణ పరిపాలన శాఖలో ముందుగానే పొందాలని తెలిపారు. సచివాలయ అధికారులు, సిబ్బంది మింట్‌ కాంపౌండ్‌ వద్ద నుంచి నార్త్‌ ఈస్ట్‌ గేటు ద్వారా సచివాలయం లోనికి ప్రవేశించాలని, అక్కడే వాహనాలను నిలిపి ఉంచాలని సీఎస్‌ ఆదేశించారు.
 
కాగా, నూతన సచివాలయంలో అంతస్తుల వారీగా ఏయే శాఖలు ఎక్కడ కొలువు దీరాలనే కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. దీంతో బీఆర్‌కే భవన్‌ నుంచి నూతన సచివాలయంలోకి దస్త్రాలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానింగ్‌ యంత్రాలను తరలించే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. సామగ్రి తరలింపునకు శాఖలవారీగా తేదీలు, సమయాలను సీఎస్‌ నిర్దేశించారు. ఆ మేరకు తొలిరోజు ఎస్సీ సంక్షేమం, హోం, గిరిజన సంక్షేమం, పౌర సరఫరాలు, పురపాలక, పట్టణాభివృద్ధి, యువజన, సాంస్కృతిక, రవాణా, రహదారులు, భవనాలు.. తదితర శాఖలు తమ సామగ్రిని తరలించాయి.