శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2023 (23:19 IST)

దసరా పండగ వేళ.. రైళ్లు, బస్సులు ఫుల్.. ప్రైవేట్ బస్సుల దోపిడీ

tsrtc
దసరా పండగ వేళ రైళ్లు -బస్సులు ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి నగర ప్రజలు సొంతూరి బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో మహాత్మాగాంధీ, జూబ్లీబస్‌స్టేషన్‌ల వద్ద పెద్ద ఎత్తున రద్దీ కనిపించింది. 
 
దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందించింది. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా కావడంతో జిల్లాలకు వెళ్లే బస్సులు కిక్కిరిసి బయలుదేరాయి. 
 
రోజువారీ రాకపోకలు సాగించే సుమారు 3,500 బస్సులతో పాటు ఇప్పటి వరకు 1,700కు పైగా బస్సులను అదనంగా నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
 
హైదరాబాద్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌, భువనేశ్వర్‌, తిరుపతి, కర్నూలు, విశాఖ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
 
పండుగ సెలవుల దృష్ట్యా గత మూడు రోజులుగా ప్రతి రోజు సుమారు 25వేల మంది అదనంగా ప్రయాణం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 
 
ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్‌ బస్సులు రంగంలోకి దిగాయి. దీంతో సాధారణ రోజుల్లో విధించే చార్జీలను రెట్టింపు చేసి వసూలు చేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి విశాఖకు రూ.980 వరకు చార్జీ ఉంటే రూ.1600కు పైగా వసూలు చేస్తున్నారు.