గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (18:41 IST)

చెల్లి పాత్రకు నో చెప్పిన నయన్ - సమ్మతించిన చెన్నై చంద్రం!

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న తదుపరి ప్రాజెక్టు లూసీఫర్. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రాజెక్టు పూర్తికాగానే మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్‌ను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు.
 
తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో హీరో సోదరి పాత్ర అత్యంత కీలకం. మలయాళంలో ఆ పాత్రను ప్రముఖ నటి మంజు వారియర్ పోషించారు. ముఖ్యమంత్రి కూతురిగా హుందాగా ఉంటూనే ఎన్నో భావాలను అవలీలగా పలికించారు. తెలుగులో ఆ పాత్ర ఎవరు చేస్తారనే ఆసక్తి మొదలైంది.
 
ఒక దశలో ఈ పాత్రకు సీనియర్ హీరోయిన్ విజయశాంతి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాత నయనతార పేరు తెర మీదకు వచ్చింది. నయన్ కన్ఫామ్ అని కూడా వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి సోదరిగా కనిపించడానికి నయన్ అంగీకరించలేదట. ప్రస్తుతానికి హీరోయిన్‌గా బిజీగా ఉన్న తను సోదరి పాత్రలు చేయకూడదని నయన్ భావిస్తోందట. 
 
ఆ కారణంతోనే నయన్ 'లూసిఫర్' రీమేక్‌కు నో చెప్పిందని సమాచారం. దీంతో చిత్రబృందం త్రిషను సంప్రదించింది. ఆ రోల్ చేసేందుకు త్రిష అంగీకరించినట్టు సమాచారం అందింది. టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన త్రిష ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. 
 
కాగా, గతంలో చిరంజీవి, త్రిష 'స్టాలిన్' సినిమాలో జంటగా నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న `ఆచార్య`లో హీరోయిన్‌గా ముందుగా త్రిషనే ఎంపిక చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల త్రిష తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి కాజల్ వచ్చి చేరింది. `లూసిఫర్` రీమేక్‌లో మాత్రం నటించడానికి త్రిష అంగీకరించిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.