బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (17:24 IST)

"కాంతార" సీక్వెల్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్

urvashi - rishabh
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం "కాంతార". విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా, కేవలం రూ.16 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.400 కోట్లు రాబట్టింది. చిత్రానికి సీక్వెల్ తీసే పనిలో హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి నిమగ్నమయ్యారు. పైగా, ఈ సీక్వెల్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్‌ను ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. 
 
హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం తొలుత కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాగా, ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లోకి అనువదించారు. ఈ భాషల్లో కూడా ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించి, భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా "కాంతార-2" ఉంటుందని నిర్మాణ సంస్థ హోంబలే అధినేత విజయ్ కిరంగదూర్ ప్రకటించారు. 
 
ఇందుకోసం దర్శక హీరో రిషబ్ శెట్టి స్క్రిప్టు పనుల్లో నిమగ్నమయ్యారు. తొలి భాగం ప్రారంభమైనప్పటి ముందు పరిస్థితులను రెండో భాగంలో చూపించనున్నట్టు సమాచారం. అయితే, ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతలా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇటీవల తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" చిత్రంలో ఆమె ఓ ప్రత్యేక గీతంలో నటించారు. ఈ క్రమంలో ఆమెకు "కాంతార-2" చిత్రంలో ఛాన్స్ దక్కింది. ఈ మేరకు రిషబ్ శెట్టితో కలిసి దిగిన ఫోటోను ఆమె షేర్ చేయడంతో ఆమెను "కాంతార-2" కోసం ఎంపిక చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.