డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అస్వస్థతతో చెన్నైలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం చేరారు. ఈ వార్త మీడియాలో వైరల్ అయింది. రెహ్మాన్కు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి, యాంజియో చికిత్స చేశారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై వైద్యులు స్పందించారు.
రెహ్మాన్ డీహైడ్రేషన్తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. రంజాన్ మాసం కావడంతో ఉపవాసం దీక్ష ఉండటంతో పాటు లండన్ నుంచి ప్రయాణం చేసి రావడంతో ఏర్పడిన బడలిక కారణంగా శనివారం రాత్రి తీవ్ర అసౌకర్యంగా ఫీలయ్యారని రెహ్మాన్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
చెన్నైలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం అస్వస్థతకు లోనుకావడంతో రెహ్మాన్ను అపోలో ఆస్పత్రికి తరలించినట్టు వైద్యులు తెలిపారు. వైద్యులు ఆయనకు ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారని చెప్పారు. అయితే, ఉపవాసం కారణంగా రెహ్మాన్ డీహైడ్రేషన్కు గురయ్యారని వైద్యులు చెప్పినట్టు ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం రెహ్మాన్ కోలుకుంటున్నారని వివరించారు.