కడుపు మాడ్చుకుంటూ ఆహార నియమాలు... ప్రాణాలు కోల్పోయిన కేరళ యువతి!
అధిక బరువుతో బాధపడుతూ వచ్చిన ఓ యువతి కడుపు మాడ్చుకుంటూ ఆహార నియమాలు పాటించింది. ఏకంగా మూడు నెలల పాటు ఆహారాన్ని మానేసి, కఠిన ఆహార నియమాలు పాటించింది. చివరకు ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి వయసు కేవలం 18 సంవత్సరాలే కావడం గమనార్హం.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని కన్నూర్లోని కూథుపరంబకు చెందిన శ్రీనంద అనే యువతి అధిక బరువుతో బాధపడుతూ వచ్చింది. దీంతో యూట్యూబ్ను చూస్తూ కఠిన ఆహార నియమాలు పాటించసాగింది. ఈ కారణంగా విపరీతమైన ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరింది. చివరకు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
మూడు నెలలుగా ఆహారాన్ని తీసుకోవడంలో శ్రీనంద ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఆమెను థలస్సెరీ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయానికి ఆమె బీపీ 70, ఆక్సిజన్ స్థాయి 70-72గాను, సోడియం, పొటాషియం స్థాయిలు అత్యంత తక్కువగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.
ఆహార నియమాలు పాటించక ముందు శ్రీనంద 50 కేజీల బరువుండగా తమ ఆస్పత్రికి వచ్చేటప్పటికీ కేవలం 25 కేజీల బరువుతో ఉందని వైద్యులు తెలిపారు. మూడు నెలల్లో ఈ స్థితికి చేరుకుందని వివరించారు.
తమ కుమార్తె మృతిపై తల్లిదండ్రులు స్పందిస్తూ, తమ కుమార్తె ఆరు నెలల నుంచి బరువు తగ్గేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని, క్రమేపీ ఆహారం తీసుకోవడం తగ్గించేసింది. మూడు నెలల నుంచి మొత్తం మానేసింది. చివరకు నీళ్లు తాగడం కూడా మానేసింది అని వాపోయారు.